హాట్ టాపిక్: ఎసిబి కార్యాలయంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) శాసనసభ్యుడు ఒకరు అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) కార్యాలయానికి రావడం చర్చనీయాంశంగా మారింది. మెదక్ జిల్లా సంగారెడ్డి టిఆర్ఎస్ శాసనసభ్యుడు చింతా ప్రభాకర్ రెడ్డి బుధవారం సాయంత్రం హైదరాబాదులోని బంజారాహిల్స్లో గల ఎసిబి కార్యాలయానికి వచ్చారు.
కేవలం వ్యక్తిగత పనుల కోసమే తాను ఎసిబి కార్యాలయానికి వచ్ిచనట్లు ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. మీడియా ప్రతినిధులు వేసిన మరిన్ని ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవ్వడానికి నిరాకరించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ను ఎసిబి అధికారులు ఓటు నోటు కేసులో ప్రశ్నిస్తున్న సమయంలో ఆయన రావడం గమనార్హం.
ఓటుకు నోటు కేసులో ఇప్పటికే ఎసిబి అధికారులు తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ్యులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలను అరెస్టు చేశారు. వారిని విచారించారు కూడా. సెబాస్టియన్, ఉదయసింహలను కూడా అరెస్టు చేశారు. వారు నలుగురు కూడా ప్రస్తుతం బెయిల్పై జైలు వెలుపలే ఉన్నారు.
కాగా, వేం నరేందర్ రెడ్డిని ఎసిబి అధికారులు ఇంతకు ముందు విచారించి, వదిలేశారు. తాజాగా బుధవారంనాడు ఆయన కుమారుడు కృష్ణ కీర్తన్ను విచారించారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపికి అనుకూలంగా ఓటు వేసేందుకు కొంత మంది టిఆర్ఎస్ శాసనసభ్యులు ముడుపులు తీసుకున్నారనే ఆరోపణపై ఎసిబి అధారాలు సేకరించినట్లు సమాచారం. వారిని కూడా ఎసిబి ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో సంగారెడ్డి టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎసిబి కార్యాలయానికి రావడం చర్చనీయాంశంగా మారింది.