ఎమ్మెల్యేల ఎర కేసులో బీఎల్ సంతోష్కు ఊరట: సిట్ నోటీసులపై హైకోర్టు స్టే
హైదరాబాద్: బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్కు హైకోర్టులో ఊరట లభించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) జారీ చేసిన నోటీసులపై బీఎల్ సంతోష్ హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్పీసీ 41ఏ నోటీసు రద్దు చేయాలని లంచ్ మోషన్ దాఖలు చేశారు.
బీఎల్ సంతోష్పై దుష్ప్రచారం
నవంబర్ 26 లేదా 28న విచారణకు హాజరు కావాలని బీఎల్ సంతోష్కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై బీఎల్ సంతోష్ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు. ముందుగా నిర్ణయించుకున్న కొన్ని సమావేశాల కారణంగా సిట్ విచారణకు రాలేకపోయారని సంతోష్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సిట్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగానే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. ఈ కేసు వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, సీఆర్పీసీ 41ఏ నోటీసు రద్దు చేయాలని కోర్టును కోరారు బీఎల్ సంతోష్.
ఫిర్యాదులో బీఎల్ సంతోష్ పేరు లేకుండానే..
కేసును అత్యవసరంగా విచారణ జరపాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫిర్యాదులో బీఎల్ సంతోష్ పేరు లేదని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. కాగా, ఫిర్యాదులో లేనప్పుడు ఎఫ్ఐఆర్లో ఎలా చేరుస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బీఎల్ సంతోష్ పాత్రపై ఆధారాలున్నాయని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. సంతోష్ విచారణకు వస్తే అన్ని విషయాలు బయటకొస్తాయని వాదనలు వినిపించారు.
నోటీసులిచ్చిన తర్వాతే నిందితుడిగా బీఎల్ సంతోష్ పేరు..
41ఏ నోటీసులిచ్చిన తర్వాత సంతోష్ ను నిందితుడిగా చేర్చినట్లు.. ఏసీబీ కోర్టులో మెమో ఎలా వేస్తారని సంతోష్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. 41ఏ నోటీసుల విషయంలో హైకోర్టు సింగిల్ జడ్జీ ఆదేశాలను ప్రస్తావించారు ఏజీ. వాదనలు విని, విచారణ చేపట్టిన హైకోర్టు.. సిట్ జారీ చేసిన నోటీసుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 5కి వాయిదా వేసింది.
ఇది ఇలావుండగా, ఎమ్మెల్యేల ఎర కేసులో తెలంగాణ సిట్ నోటీసులు అందాయని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఢిల్లీలోని తన నివాసంలో సిట్ నోటీసులు అందజేశారని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి నవంబర్ 29న బంజారాహిల్స్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని సూచించినట్లు తెలిపారు.