తెలంగాణ ఎన్నికలపై లగడపాటి సర్వే-ఓటుకు నోటుకు లింక్!! ఆ ఫలితాల మర్మం ఇదేనా?
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రులు ఎనిమిది నుంచి పదిచోట్ల గెలుస్తారని లగడపాటి రాజగోపాల్ ఇటీవల చెప్పారు. కానీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో, ఏ పార్టీకి లేదా ఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పలేదు. సర్వే ఫలితాలు అంటూ ఆయన చెప్పిన జోస్యంపై ఏ పార్టీకి సంతృప్తికరంగా లేదు. దీనిపై బీజేపీ కిషన్ రెడ్డి అదే రోజు మండిపడ్డారు.
తాజాగా, తెరాస నేత, ఎంపీ వినోద్ కుమార్ కూడా మండిపడ్డారు. ప్రజలను తికమక పెట్టేందుకు లగడపాటి చూస్తున్నారని చెప్పారు. అందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్, టీడీపీల మధ్య వారధిగా పని చేసేందుకు లగడపాటి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తెలంగాణను పరోక్షంగా పాలించాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారన్నారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేసిన అసత్య ఆరోపణలను ప్రజలు ఓట్ల ద్వారా తిప్పికొట్టాలన్నారు.
లగడపాటి సర్వేలపై అనుమానాలు, చంద్రబాబును లాగారు
లగడపాటి రాజగోపాల్ సర్వేపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికలపై చంద్రబాబు కుట్ర చేస్తున్నారని, తటస్థ ఓటర్లను లక్ష్యంగా చేసుకొని ఫలితాలను ప్రభావితం చేయడం ద్వారా తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఏర్పడేలా చేయాలని కుట్ర చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో హంగ్ ఏర్పడేలా చేసి ఇక్కడ పాలనను తన చేతుల్లోకి తీసుకొని చక్రం తిప్పాలని భావిస్తున్నారని అంటున్నారు. లగడపాటి సర్వేల వెనుక మర్మమంటూ తెరాస అనుకూల వర్గాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
చంద్రబాబు రాజకీయ జీవితం - ఓటుకు నోటు
లగడపాటి వంటి వారి ద్వారా సర్వేల పేరుతో తటస్థ ఓటర్లను ప్రభావితం చేసి, హంగ్ వస్తే.. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఓటుకు నోటు కేసును నీరుగార్చడమే చంద్రబాబు ఉద్దేశ్యంగా అనుమానిస్తున్నారు. చంద్రబాబుకు ఎప్పటికైనా ఓటుకు నోటు కేసు మెడకు చుట్టుకోక తప్పదని, ఈ కేసు కారణంగా చంద్రబాబుతో పాటు లోకేష్, టీడీపీ రాజకీయ భవిష్యత్తు ఆందోళనగా మారుతుందని, అందుకే తెలంగాణలో పరిపాలనను తన గుప్పిట్లో ఉంచుకోవాలని అనుకుంటున్నారని చూస్తున్నారట.
లగడపాటితో సర్వే పేరుతో చంద్రబాబు డ్రామా
కేసీఆర్ను అధికారంలోకి రాకుండా అడ్డుకోగలిగితే తెలంగాణ ప్రజలు తనకు బ్రహ్మరథం పట్టారని ఏపీలో ప్రచారం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని, తద్వారా 2019 ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలన్నది చంద్రబాబు ఉద్దేశ్యంగా చెబుతున్నారు. అందుకే లగడపాటితో సర్వేల పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని అంటున్నారు.
వ్యతిరేకత ఉందని చెప్పడమే ఉద్దేశ్యం
లగడపాటి సర్వేలో పదిమంది వరకు స్వతంత్రులు గెలుస్తారని చెప్పడం ద్వారా తెరాస పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పడమే ఇందులోని మర్మం అని అంటున్నారు. తద్వారా తటస్థ ఓటర్ల దృష్టి మరల్చాలనేది వారి ఉద్దేశ్యమని చెబుతున్నారు. దీని వెనుక చంద్రబాబు ఆలోచన ఉందని అనుమానిస్తున్నారట.