జీఎస్టీ పేరుతో లూటీ: మోడీ సర్కార్పై టీఆర్ఎస్ మార్క్ ఫైర్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ సవరణలు అమలులోకి వచ్చాయి. పలు రకాల నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. బ్యాంకింగ్ సేవలు సైతం మరింత ప్రియం అయ్యాయి. ఆసుపత్రుల సేవలపైనా పెనుభారం పడింది. హోటల్ గదుల పరిస్థితీ ఇంతే. ఆసుపత్రులు, హోటల్ గదుల వినియోగాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు జీఎస్టీ పరిధిలోకి లేని పలు రకాల నిత్యావసర సరుకులపై తాజాగా విపరీతమైన భారం పడింది.
పెరుగు, లస్సీ, మజ్జిగ, పన్నీరు వంటివి ముట్టుకుంటే చేతులు కాలేలా తయారయ్యాయి. రోజూ వినియోగించే బియ్యం, గోధుమలు, రాగి, బార్లీ, ఓట్స్ వంటి ఆహార ధాన్యాలు కూడా జీఎస్టీ పరిధిలోకి వచ్చాయి. పెరుగు, లస్సి, మజ్జిగ, పన్నీర్, బియ్యం, గోధుమలు, రాగులు, బార్లీ, ఓట్స్ పై అయిదు శాతం మేర జీఎస్టీని విధించింది కేంద్ర ప్రభుత్వం. 5,000 రూపాయలకు పైగా అద్దెను వసూలు చేస్తోన్న ఆసుపత్రుల గదులను కూడా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చింది. వాటిపై అయిదు శాతం మేర జీఎస్టీని విధించింది.
1,000 రూపాయలకు పైగా అద్దెను వసూలు చేసే హోటల్ గదులపై ఏకంగా 12 శాతం మేర జీఎస్టీని అమలు చేసింది. బ్యాంకుల్లో నుంచి కొత్తగా చెక్కులను తీసుకోవడం కూడా ఇవ్వాళ్టి నుంచి పెనుభారంగా పరిణమించింది. ఖాతాదారులకు బ్యాంకులు జారీ చేసే చెక్కులపై 18 శాతం మేర జీఎస్టీని ముక్కు పిండి మరీ వసూలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటివరకు ఇది జీఎస్టీ పరిధిలో లేదు. సోలార్ వాటర్ హీటర్స్ పై ఇదివరకే వసూలు చేస్తోన్న జీఎస్టీ శ్లాబ్ ను సవరించింది. అయిదు శాతంగా ఉన్న దీని శ్లాబ్ ను 12 శాతానికి పెంచింది.
దీన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంట్ సభ్యులు ఈ ఉదయం ఆందోళనకు దిగారు. పార్లమెంట్ ఆవరణలోని జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. దేశ ప్రజలను దోచుకోవడాన్ని మానుకోవాలంటూ నినదించారు. నిత్యావసర సరుకులను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావడం వల్ల చివరికి తినే ఆహారం కూడా ఖరీదైపోయిందని మండిపడ్డారు.
పార్లమెంట్ ఉభయ సభలనూ జీఎస్టీ వ్యవహారం కుదిపేస్తోంది. ప్రతిపక్ష సభ్యులు సభా కార్యకలాపాలకు అడ్డు పడ్డారు. సభ సమావేశమైన వెంటనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, టీఆర్ఎస్, డీఎంకే.. ఇలా ప్రతిపక్ష పార్టీల సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. పోడియంలోకి దూసుకెళ్లారు. జీఎస్టీ రేట్లను తగ్గించేంత వరకూ పోరు ఆగదని స్పష్టం చేశారు. స్పీకర్ ఓం బిర్లా వారిని వారించే ప్రయత్నం చేశారు గానీ ఫలితం ఇవ్వలేదు.