ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఏకగ్రీవం: కొత్త ఒరవడి, కేసీఆర్కు థ్యాంక్సంటూ కడియం
హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటన చేశారు. సోమవారం రాత్రి తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు.. ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నుంచి సర్టిఫికెట్ అందుకున్నారు.
కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండ ప్రకాష్, రవీందర్, వెంకట్రామిరెడ్డి, కౌశిక్ రెడ్డి సర్టిఫికెట్ తీసుకున్న వారిలో ఉన్నారు. కాగా, నవంబర్ 16న టీఆర్ఎస్ అభ్యర్థులు గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండా ప్రకాశ్, పాడి కౌశిక్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అదే రోజు దాఖలు చేసిన మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్తుల నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది.
ఇక ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ... తమకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుంది తెలంగాణ అని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. అన్ని ప్రాం తాలు, అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు సీఎం కేసీఆర్ చిత్త శుద్ధితో కృషి చేస్తున్నారన్నారు.
అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలిపారు. అన్ని రంగాల్లో ఎదుగుతున్న తెలంగాణను ఓర్వలేక బీజేపీ, కేంద్రం తెలంగాణా ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుందని ఆరోపించారు. నరేంద్ర మోడీ, బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అవుతున్నా.. ఏం సాధించారో దేశ ప్రజలకు చెప్పాలన్నారు. ఈ ఏడేళ్లలో దేశ జీడీపీ భారీగా తగ్గిందన్నారు.
కరోనా సమయంలో మైనస్ జీడీపీకి వెళ్లిందని కడియం శ్రీహరి చెప్పారు. నరేంద్ర మోడీ గొప్ప పరిపాలన ధక్షకుడు అయితే దేశ జీడీపీ ఎలా తగ్గిందో రాష్ర్ట బీజేపీ నేతలు చెప్పాలని కడియం ప్రశ్నించారు. ధాన్యం సేకరణ అనేది కేంద్రం పరిధిలో ఉన్న అంశమని, కానీ కేంద్రం తెలంగాణ ధాన్యం కొనడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు మొద్దు నిద్ర వీడి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢీల్లీలో పోరాటం చేయాలని కడియం శ్రీహరి సూచించారు.