కరోనా వ్యాప్తి: జీహెచ్ఎంసీలో ఇంటి ఇంటి సర్వే, ట్రేస్ చేసి, బాధితులకు మెడికల్ కిట్లు
హైదరాబాద్: కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో కరోనా లక్షణాలు కలిగినవారిని గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వ్యాప్తి తాజా పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో కూడా తాజా పరిస్థితులపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటి సర్వే కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి బృందంలో ఇద్దరు మున్సిపల్ స్టాఫ్, ఇద్దరు ఆశా వర్కర్లు, ఒక ఏఎన్ఎం ఉండేలా చూడాలని జీహెచ్ఎంసీ అధికారులకు స్పష్టం చేశారు.

హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, అర్బన్ హెల్త్ సెంటర్లు, బస్తీ, దవాఖానాల్లో ఓపీ సేవలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక బృందాల ద్వారా నిర్వహించే సర్వేలో లక్షణాలు కలిగిన వారిని గుర్తిస్తే వెంటనే వారికి ఈ క్లినిక్ ల ద్వారా మెడికల్ కిట్లు అందజేయాలన్నారు. అంతేగాక, వారి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆ బృందాలే పర్యవేక్షించాలని సీఎస్ స్పష్టం చేశారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిళ్లలో కోవిడ్ కేర్ సెంటర్లను ప్రారంభించాలని అధికారులను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, అర్బన్ ఆస్పత్రులు, బస్తీ దవాఖానాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, ఆస్పత్రులు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అంతకుముందు, జరిగిన సమీక్షలో రాష్ట్రంలోని కరోనా బాధితుల కోసం మరో 5 లక్షల మెడికల్ కిట్లను ఇంటి వద్దకే పంపించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. కరోనా బాధితులకు అన్ని జిల్లాల్లో హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా హెల్ప్లైన్ కాల్ సెంటర్ నెంబర్ 040-2111-1111ను సంప్రదించాలని కోరారు.
కాగా, తెలంగాణలో రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసుల ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో(శనివారం రాత్రి 8 గంటల వరకు) 76,330 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 7430 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,50,790కి చేరింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వివరాలను వెల్లడించింది.
రాష్ట్రంలో ఆదివారం కరోనాతో 56 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించినవారి సంఖ్య 2368కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 80,695 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1546 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 1,30,60,114 కరోనా పరీక్షలను నిర్వహించారు.












Click it and Unblock the Notifications