కేంద్రం - తెలంగాణ గవర్నర్ లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం..!!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ సమావేశాల్లో కేంద్రం - గవర్నర్ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్దం అవుతోంది. ఇప్పటికే కేంద్రం - గవర్నర్ తీరు పైన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. ఈ సారి కూడా స్పీకర్ అనుమతితోనే సమావేశాలను నిర్వహించబోతున్నారు. గవర్నర్ అనుమతి కోరకుండానే సెప్టెంబరులో సమావేశాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. స్పీకర్ పోచారం శ్రీనివా్సరెడ్డి సెప్టెంబరు 6న సమావేశాలను ప్రారంభించగా.. 12, 13 తేదీల్లో మూడు రోజుల పాటు కొనసాగాయి. ఇప్పుడు కూడా అదే ఆనవాయితీని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అదే సమయంలో గవర్నర్ అధికారాల్లో ప్రధానమైన అంశం పై ఈ సమావేశాల్లో నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు..
తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. ఈ నెల 10న జరిగే తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ నిర్వహణ పైన నిర్ణయం తీసుకోనున్నారు. అదే విధంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టే తీర్మానాలు - బిల్లుల పైన కేబినెట్ భేటీలో నిర్ణయించనున్నారు. గత సమావేశాల కొనసాగింపు గానే ఈ సమావేశాల నిర్వహణగా ప్రభుత్వం పేర్కొంటోంది. గవర్నర్ను దూరం పెట్టాలన్న ఉద్దేశంతో ఈసారి కూడా స్పీకర్ ద్వారానే సమావేశాలను ప్రారంభించనుంది. ఈ సమావేశాల ద్వారా కేంద్రం తెలంగాణ పైన వ్యవహరిస్తున్న తీరు..గవర్నర్ వైఖరి పైన ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు..ప్రతిపాదించే తీర్మానాలు కీలకం కానున్నాయి.

కేంద్ర తీరుకు నిరసనగా తీర్మానాలు..
ఇప్పటికే కేంద్రం తెలంగాణ ప్రభుత్వం పైన వ్యవహరిస్తున్న తీరును సీఎం కేసీఆర్ తో సహా ఆ పార్టీ నేతలంతా తప్పు బడుతున్నారు. ఈ సమయంలోనే అసెంబ్లీ సమావేశాల వేదికగా కేంద్ర తీరును నిరసిస్తూ తీర్మానాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర రుణాలపైన ఆంక్షలు, గ్రాంట్లను పూర్తి స్థాయిలో విడుదల చేయకపోవటాన్ని సభ ద్వారా వివరించనుంది. కేంద్రం ఆంక్షలు విధించకపోతే రాష్ట్ర జీఎస్ డీపీ మరో రూ.3 లక్షల కోట్లు పెరిగి రూ.14.50 లక్షల కోట్లకు చేరేదని, ఆంక్షల కారణంగా రూ.11.50 లక్షల కోట్లకే పరిమితమైందన్న ఆగ్రహంతో ప్రభుత్వం ఉంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలకు నీతి ఆయోగ్ సిఫారసు చేసిన గ్రాంట్లను ఇవ్వడం లేదని.. 14వ, 15వ ఆర్థిక సంఘాల సిఫారసుల మేరకు గ్రాంట్లు విడుదల చేయడం లేదని ప్రభుత్వం చెప్పుకొస్తోంది. మంత్రులపై ఐటీ, ఈడీల ద్వారా దాడులు చేయిస్తోందని ఆరోపిస్తోంది. ఇలా కేంద్ర ప్రభుత్వ వైఖరిని సభకు వివరిస్తూనే.. తీర్మానాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ తీర్మానాలను కేంద్రానికి పంపే అవకాశముంది.

గవర్నర్ అధికారాల్లో కోతకు ఛాన్స్..!?
రాష్ట్ర గవర్నర్ తీరును కూడా ప్రభుత్వం తప్పుపడుతోంది. ఈ సమావేశాల్లో గవర్నర్ వైఖరిపై చర్చించనున్నట్లు సమాచారం. గత సమావేశాల్లో ప్రభుత్వం ఎనిమిది బిల్లులను ఆమోదం కోసం గవర్నర్ కు సిఫార్సు చేయగా, ఒక్క జీఎస్టీ బిల్లును మాత్రమే గవర్నర్ ఆమోదించారు. మిగిలిన బిల్లులను పెండింగ్ లో ఉంచారు. ఈ బిల్లులను ఆమోదించాలంటూ ఓ తీర్మానం చేసి, గవర్నర్కు పంపనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో యూనివర్సిటీలకు చాన్స్లర్గా గవర్నర్ను తొలగించే బిల్లునూ ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. గవర్నర్ ప్రభుత్వం పైన చేస్తున్న వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు మంత్రులు - పార్ట నేతల ఖండిస్తున్నారు. అయితే, సభలో జరిగే చర్చ ద్వారా గవర్నర్ తీరును ప్రజలకు వివరించాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. గవర్నర్ కేంద్ర పెద్దలతో సమావేశాలు.. తెలంగాణ ప్రభుత్వం పైన విమర్శలతో రాజ్ భవన్ - ప్రభుత్వం మధ్య గ్యాప్ మరింతగా పెరుగుతోందనే అభిప్రాయం ఉంది. దీంతో, అసెంబ్లీ వేదికగా ఏం చేయబోతున్నారనేది 10న జరిగే కేబినెట్ భేటీలో క్లారిటీ రానుంది.












Click it and Unblock the Notifications