viral video: నడిరోడ్డుపై బూడిదైన tsrtc బస్సు -డ్రైవర్ సహా 29 మంది ప్రయాణికులు సేఫ్
తెలంగాణలో భారీ వర్షాలు దంచికొడుతోన్న వేళ రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సు ఒకటి అగ్గికి ఆహుతైంది. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు లోపలుండగానే బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో భారీ ప్రాణనష్టం తప్పదింది. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ వద్ద శుక్రవారం చోటుచేసుకున్న ఈ ప్రమాదం తాలూకు వీడియో వైరల్ అవుతున్నది..
Recommended Video
టీఎస్ ఆర్టీసీకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు (TS 28 ఎస్టీ జెడ్ 5403) జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ వద్ద ప్రమాదానికి గురైంది. శుక్రవారం హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా స్టేషన్ఘన్పూర్ వద్దకు రాగానే బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు...

మంటలను గుర్తించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై, బస్సును రోడ్డుపక్కన నిలిపివేసి, ప్రయాణికులను కిందకు దించారు. ప్రయాణికులు బస్సు దిగిన వెంటనే క్షణాల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. అగ్ని ప్రమాదం విషయం తెలియడంతో స్థానిక సీఐ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు రమేష్, అనితలు జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేశారు. స్టేషన్ఘన్పూర్ బస్టాండుకు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా ఆందోళన చెలరేగింది..

సూపర్ లగ్జరీ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. కళ్లెదుటే బస్సు దగ్ధం కావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్నిమాపక శాఖ ఆలస్యంగా స్పందించినట్లు మీడియాలో రిపోర్టులు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
viral video: నడిరోడ్డుపై బూడిదైన tsrtc బస్సు -డ్రైవర్ సహా 29 మంది ప్రయాణికులు సేఫ్#tsrtc #bus #fire #accident, #ghanpur pic.twitter.com/fS5WlNylIo
— oneindiatelugu (@oneindiatelugu) July 23, 2021












Click it and Unblock the Notifications