TSRTC STRIKE:టెంపరరీ డ్రైవర్లు, కండక్టర్లను అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు, పోలీసులతో వాగ్వివాదం
ఆర్టీసీ కార్మికుల సమ్మె 31వ రోజుకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి లోపు విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ అల్టిమేటం జారీచేయడంతో కొందరు ఉద్యోగులు చేరుతున్నారు. మరోవైపు కార్మికుల డ్యూటీలో చేరొద్దని డిమాండ్ల సాధనం కోసం కృషిచేయాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునిస్తోంది. ఈ క్రమంలో సోమవారం సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసింది. టెంపరరీ డ్రైవర్, కండక్టర్లను కార్మికులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. పోలీసులు, కార్మికులు మాట మాట పెరిగి వాగ్వివాదానికి దారితీసింది.
కేసీఆర్ డెడ్లైన్తో కొందరు కార్మికులు విధుల్లో చేరడంతో ఆర్టీసీ జేఏసీ ఆందోళన చెందుతుంది. 2 శాతం ఉద్యోగులే చేరతారని పైకి చెప్తున్నా.. లోన మాత్రం భయం ఉంది. ఈ క్రమంలో సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. బస్టాండ్ వద్ద విధుల్లోకి వెళ్లకుండా అడ్డుకోబోయారు. సమాచారం తెలుసుకొని వెంటనే అక్కడి పోలీసులు చేరుకున్నారు. ఆర్టీసీ కార్మికులు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. తర్వాత తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
మరికొందరు పోలీసు వాహనాల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ విలీనం సహా 26 డిమాండ్లు పరిష్కరించాలని కార్మికులు గత 31 రోజుల నుంచి ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఆర్థికభారం లేని డిమాండ్లను మాత్రం తీరుస్తామని ఆర్టీసీ స్పష్టంచేయడంతో సమ్మె కొనసాగుతోంది. సమ్మెపై హైకోర్టులో విచారణ కూడా జరుగుతుంది.