టీటీడీపీ ఆంధ్రా పార్టీ కాదు.. 'ఆంధ్రా' పదానికి కాలం చెల్లిపోయింది : రేవంత్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీపై ఆంధ్రా పార్టీ అన్న విమర్శలను ఖండించారు టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి. టీడీపీ పార్టీ తెలంగాణలో పుట్టి.. తెలంగాణలో పెరిగిన పార్టీ అని గుర్తు చేశారు. ఆంధ్ర అన్న పదానికి కాలం చెల్లిపోయిందని, టీటీడీపీని ఉద్దేశించి ఇంకా 'ఆంధ్రా పార్టీ' అన్న కామెంట్స్ చేయడం సబబు కాదని సూచించారు.
కాగా, మంగళవారం నుంచి ఇరు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా.. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ విధానాలకు కట్టుబడే తమ పార్టీ నడుస్తోందని.. ప్రస్తుతం టీఆర్ఎస్లో మంత్రులుగా ఉన్న తుమ్మల నాగేశ్వరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ వ్యతిరేకులు కాదా..? అని ప్రశ్నించారు రేవంత్.
తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేసేవరకు పోరాడతామని, ఇందుకోసం జేఏసీ చైర్మన్ కోదండరాం చేస్తున్న ప్రతిపాదనలను సమర్థిస్తున్నామని రేవంత్ తెలిపారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఆనాడు కోదండరాం చేసిన ప్రతిపాదనలను అంగీకరించామని, రైతుల కోసం ఇప్పుడాయన చేస్తున్న ప్రతిపాదనలను గౌరవిస్తున్నామని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ విఫలమైందని, తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి రైతుల పక్షాన పోరాడతామని తెలియజేశారు.
తెలంగాణలో రైతులకు పూర్తి రుణమాఫీ చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే, కేవలం 300 రైతుల కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వం రూ.6 లక్షల పరిహారం ఇచ్చిందని ఆరోపించారు.
రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని, ప్రభుత్వం నుంచి రైతులకు భరోసా లేకుండా పోయిందని ఆరోపించారు. రైతుల కష్టాలను తెలుపుతూ ప్రొ.కోదండరాం ఇటీవల ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టిన సందర్భంగా తెలిపిన అజెండాను నూరుశాతం అమలు చేయాలని ఈ సందర్బంగా ఆయన డిమాండ్ చేశారు.