టిడిపికి టిఆర్ఎస్ ట్విస్ట్: సీమాంధ్రులు మీ వాళ్లు కాదంటూ వ్యాఖ్య
హైదరాబాద్: ఉమ్మడి హైదరాబాదులోని సీమాంధ్రులకు రక్షణ లేదంటూ తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ మంతులు చేస్తున్న వాదనకు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ట్విస్ట్ ఇచ్చింది. హైదరాబాదు నగరంలో నివసిస్తున్న సీమాంధ్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు కాదని, వారంతా తమ రాష్ట్రానికి చెందినవారేనని టిఆర్ఎస్ నేతలు బీగాల గణేష్, గువ్వల బాలరాజు అన్నారు.
హైదరాబాదు నగరంలో అన్ని ప్రాంతాలవారు హాయిగా, సామరస్యంగా జీవిస్తున్నారని వారు గురువారం మీడియాతో అన్నారు తప్పు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేసు నుంచి తప్పించుకునేందుకు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని వారన్నారు.
సిబిఐ కేసుల నుంచి కూడా తప్పించుకున్న చరిత్ర చంద్రబాబుదేనని వారు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేసి వాయిస్ టెస్టుకు హాజరు కావాలని వారు డిమాండ్ చేశారు.
సెక్షన్ 8 ఉండాలి కానీ, ఇప్పుడు అమలు చేయాల్సిన పరిస్థితి లేదని సెటిలర్స్ ఫోరం గురవారంనాడు చెప్పిన నేపథ్యంలో టిఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో హైదరాబాద్ విలువ మరింత పెరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ పాలకులు తమను అడ్డుపెట్టుకొని రెచ్చగొడుతున్నారని వారు ఆరోపించిన విషయం తెలిసిందే.
హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న ఏపీ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను వారు ఖండించారు. తెలంగాణ సచివాలయంలో సెటిలర్స్ కోసం ఫిర్యాదు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి వారు సూచించారు.