స్కూల్ నుంచి విద్యార్థినుల అదృశ్యం, కలకలం: వరంగల్లో యువతిని ఎత్తుకెళ్లి రేప్
హైదరాబాద్: వరంగల్ జిల్లాలో ఇద్దరు విద్యార్థుల అదృశ్యం, మృతి మిస్టరీ వీడకముందే రాజధాని హైదరాబాదులో ఇద్దరు అమ్మాయిల అదృశ్యం కలకలం రేపుతోంది. ఓ గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన (2015 డిసెంబర్ 7) అదృశ్యమయ్యారు.
అదృశ్యమైన విద్యార్థినీల పేరు మమత, ధరణి అని తెలుస్తోంది. పాఠశాల నుంచి బయటకు వెళ్లిన వారు ఆ తర్వాత నుంచి కనిపించడం లేదని ప్రిన్సిపల్ గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, వారి కోసం గాలిస్తున్నారు.
కళాశాల విద్యార్థినిపై అత్యాచారం
కాలేజీ విద్యార్థినిని బలవంతంగా బైక్ పైన తీసుకెళ్లి హన్మకొండలో అత్యాచారానికి పాల్పడిన సంఘటన గురువారం నర్సంపేటలో వెలుగు చూసింది. ఓ గ్రామానికి చెందిన యువతి నర్సంపేటలో ప్రయివేటు హాస్టల్లో ఉంటూ స్థానిక కళాశాలలో చదువుకుంటోంది.
చెన్నారావుపేట మండలం అక్కల్చెడకు చెందిన సురేష్ గత రెండేళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పి యువతి వెంటపడుతున్నట్లు పోలీసులకు తెలిపింది.
రోజు మాదిరిగానే ఆ యువతి హాస్టల్ నుంచి బుధవారం కళాశాలకు నడిచి వెళుతుండగా అదే సమయంలో సురేష్ బైక్ పైన వచ్చి బలవంతంగా హన్మకొండకు తీసుకెళ్లి అతడి సోదరుడి గదిలో ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసున మోదు చేసుకొన్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.