వేశ్యాగృహాలకు వెళ్లేందుకు సదర్ హోం నుంచి యువతుల పరారీ
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సదర్ హోం నుండి పారిపోతున్న ఇద్దరు యువతులను రామగుండం రైల్వే పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున రైలుకోసం ఎదురు చూస్తున్న ఆ యువతులు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. బెంగాల్కు చెందిన ఓ యువతితో పాటు ఒడిషాకు చెందిన మరో యువతి రైల్వే పోలీసులకు పట్టుబడ్డారు.
ఈ ఇద్దరినీ విచారించగా దిగ్భ్రమ కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పశ్చిమ బెంగాల్లోని వేశ్యాగృహాలకు వెళ్లేందుకే కరీంనగర్ సదర్ హోం నుండి తప్పించుకు వచ్చినట్లు వారు చెప్పడంతో పోలీసులు బిత్తరపోయారు. బెంగాల్కు చెందిన యువతి ఇటీవలే కరీంనగర్ సదర్హోంలో చేరింది. అక్కడినుండి వారం క్రితమే తప్పించుకుని పారిపోతూ రామగుండం రైల్వే స్టేషన్లో పోలీసులకు చిక్కగా ఈ యువతిని తిరిగి సదర్హోంకు తరలించారు.
అయితే అక్కడ వారం రోజులకే సదర్హోంలోని మరో యువతిని మభ్యపెట్టి, బెంగాల్కు వెళ్దామని, అక్కడ తనకు తెలిసినవారు ఉన్నారని, వేశ్యాగృహాలకు వెళ్తే ఎంతో బాగా బతకవచ్చని నమ్మబలికి తన వెంట తీసుకువచ్చింది. బెంగాల్లో సుమారు 20 మందితో బెంగాల్ యువతికి తెలిసిన వ్యక్తి ఒకరు వేశ్యాగృహాన్ని నడిపిస్తుండగా అక్కడికే ఒడిషా యువతిని వెంటబెట్టుకొని వెళ్తున్నట్లు వెల్లడించాడు. గురువారం అర్ధరాత్రి కరీంనగర్ సదర్హోం నుండి పారిపోయి పెద్దపల్లి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు.
వీరు అక్కడ అనుమానాస్పదంగా రైల్వే పోలీసులకు కానరావడంతో రామగుండం జిఆర్పి పోలీస్ స్టేషన్కు తరలించి ఆర్పిఎఫ్ ఎస్ఐ వెంకటస్వామి, జిఆర్పి హెచ్సి బషీరొద్దీన్ సమక్షంలో విచారించి కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన చైల్డ్లైన్ 1098 అనే సంస్థకు చెందిన ప్రతినిదులు పి. రజిత, సిహెచ్ రామరాజుకు అప్పగించారు.