విషాదం: తెల్లారితే పెళ్లి... చావుడప్పులు మోగాయి
హైదరాబాద్: పెళ్లింట్లో విషాదం చోటు చేసుకుంది. తెల్లారితే పెళ్లి డప్పులు మోగాల్సిన ఇంటిలో చావు డప్పులు మోగాయి. యువకుడిని పెళ్లికొడుకును చేసిన వేడుకలో ఆనందంగా గడిపిన ఆ కుటుంబంలో ఇంటి పెద్దతో పాటు, మనవరాలు మృత్యువాత పడగా మరో ఏడుగురు గాయాలతో చికిత్స పొందుతున్నారు.
ఎదురుగా వస్తున్న మోటారు సైకిలిస్టును తప్పించ బోయి కారు ప్రమాదానికి గురికావడంతో ఈ ప్రమాదం జరిగింది. చంపాపేటలోని విష్ణుపురి కాలనీలో నివసించే కృష్ణమాచార్య(72)కు రెండో కూతురు చంద్రకళ పెద్దకొడుకు మదన్మోహన్ పెళ్లి మంగళవారం ఆలేరులో జరగాల్సి ఉంది.
దీంతో తాత కృష్ణమాచార్య తన కొడుకు, కూతుళ్లతో కలిసి చంద్రకళ ఉండే హకీంపేటలోని ఎయిర్స్ఫోర్స్ స్టేషన్ క్వార్టర్కు సోమవారం వచ్చి మనవడిని పెళ్లికొడుకుగా ముస్తాబు చేసే వేడుకల్లో పాల్గొన్నారు. రాత్రి 12 గంటలకు భార్య కౌసల్య, చిన్న కొడుకు శ్రీనివాసచారి, కోడలు స్వప్న, మనవళ్లు సాయికిరణ్, సుధాంశు, మనవరాళ్లు కమిలిని(9), రిషితలతో కలిసి కృష్ణమాచార్య తన ఇంటికి మారుతి కారులో బయలు దేరారు.
అల్వాల్ రైతుబజార్ రైల్వే బ్రిడ్జిపైకి రాగానే రుక్మిణి ఎన్క్లేవ్లోని సాయి రెసిడెన్సీలో నివసించే శక్తిసింగ్ కౌర్(22) తన పల్సర్ మోటారు సైకిల్తో వేగంగా కారువైపు దూసుకువచ్చాడు. కారు నడుపుతున్న శ్రీనివాసచారి అతన్ని తప్పించబోయి ఢీకొట్టాడు. అనంతరం బ్రిడ్జి పైనుంచి కారు పల్టీ కొట్టి లోయలో పడిపోయింది. కారులో ఉన్న కృష్ణమాచార్య, కమలిని తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు.
కారును నడుపుతున్న శ్రీనివాసచారి, స్వప్న, కౌసల్య, సుధాంశు, సాయికిరణ్, రిషితలకు గాయాలయ్యాయి. శక్తి సింగ్ కారుతో పాటు లోయలో పడటంతో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కృష్ణమాచార్య, కమలిని మృతి చెందడంతో ఐఎస్సదన్ డివిజన్ విష్ణుపురి కాలనీలో విషాదం అలముకుంది.
పెళ్లి బృందం డిసిఎం బోల్తా
రంగారెడ్డి జిల్లా పరిగి మండలంలో పెళ్లి బృందం డిసిఎం బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఇరవై మంది వరకు గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. వారికి చికిత్స అందిస్తున్నారు.