ఘనంగా ఉజ్జయినీ మహంకాళి లష్కర్ బోనాలు.. నేడే ప్రధానఘట్టం రంగం; మాతంగి స్వర్ణలత భవిష్యవాణి
సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న ఉదయం నుండి ప్రారంభమైన బోనాల జాతరలో భాగంగా మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఉదయం తెల్లవారుజాము నుండే అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం, సారే సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఘనంగా లష్కర్ బోనాలు.. బంగారు బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత
ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి తొలి బోనం సమర్పించగా సమర్పించగా, ఎమ్మెల్సీ కవిత రెండువేల మంది మహిళలతో ఊరేగింపుగా వచ్చి మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ఇక లష్కర్ బోనాల వేడుకల సందర్భంగా మహంకాళి అమ్మవారిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి తో పాటు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హైదరాబాద్ వాసులు మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకుంటారు.
ప్రధాన ఘట్టం రంగం నేడే.. మాతంగి స్వర్ణలత భవిష్య వాణి
ఇక బోనాల వేడుకల్లో ప్రధాన ఘట్టమైన రంగం ఈరోజు నిర్వహించడానికి ఆలయ పూజారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మాతంగి స్వర్ణలత అమ్మవారి భవిష్యవాణి పలకనున్నారు. అమ్మవారు జోగిని శరీరంపై ఆవహించి భవిష్యవాణి చెబుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఇక రంగంలో అమ్మ వారు చెప్పే మాటలు నిజమవుతాయని నమ్ముతారు. ఈ ఏడాది రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉంటాయో రంగంలో అమ్మవారు భవిష్య వాణి వినిపిస్తుంది జోగినీ స్వర్ణలత. ఇక భవిష్యవాణి అనంతరం అమ్మవారి అంబారీ ఊరేగింపు వైభవంగా సాగుతుంది. ఇక అంబారీ ఊరేగింపుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా అధికారులు పూర్తిచేశారు.
పలహారం బండ్ల ఊరేగింపుతో బోనాలు ముగింపు
ఈరోజు సాయంత్రం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఫలహారం బండ్ల ఊరేగింపు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో నగరంలోని దాదాపు 40కి పైగా ప్రాంతాలనుంచి పలహారం బండ్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమయ్యే ఫలహారం బండ్ల ఊరేగింపు అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. ఫలహారం బండ్ల ఊరేగింపు తో ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ముగుస్తుంది.