హైదరాబాద్ లో భూగర్భ మెట్రో.. ఈ మార్గాలలోనే.. సక్సెస్ అయితే
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ విషయంలో కీలక ప్రణాళికలు చేస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ రెండోదశ విస్తరణలో విమానాశ్రయాలు, రైల్వే మార్గాలు, జాతీయ రహదారులు వంటి క్లిష్ట ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక నిర్మాణ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా హకీంపేట, శంషాబాద్ విమానాశ్రయాల సమీపంలో భూగర్భ మెట్రో మార్గాలను ప్రతిపాదించారు. రన్వే కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ ప్రణాళికలు రూపొందించబడ్డాయి.
హకీంపేటలో సుమారు 1.65 కిలోమీటర్ల మేర అండర్గ్రౌండ్ మెట్రో ప్రతిపాదన
జేబీఎస్-శామీర్పేట కారిడార్లో హకీంపేట విమానాశ్రయం సమీపంలో సుమారు 1.65 కిలోమీటర్ల మేర అండర్గ్రౌండ్ మెట్రో నిర్మించాలని నిర్ణయించారు. హెచ్ఎండీఏ ప్రతిపాదించిన హైవే టన్నెల్ వెంట ఈ మార్గాన్ని తీసుకెళ్లేలా ప్రణాళిక ఉంది. దీనివల్ల విమానాశ్రయ రన్వేకు సంబంధించిన పరిమితులను అధిగమించి భద్రతా ప్రమాణాలను పాటించే అవకాశం ఏర్పడుతుంది.

శంషాబాద్ పరిధిలోనూ సుమారు 1.6 కిలోమీటర్ల భూగర్భ మెట్రో ప్రతిపాదన
అలాగే నాగోల్-శంషాబాద్ కారిడార్లో విమానాశ్రయ పరిధిలో సుమారు 1.6 కిలోమీటర్ల భూగర్భ మెట్రోను ప్రతిపాదించారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణలో కార్గో స్టేషన్, ఎయిర్పోర్ట్ స్టేషన్ తో పాటు విమానాశ్రయ ప్రాంగణంలోనే మెట్రో డిపో ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. దీనికి పౌర విమానయాన మంత్రిత్వశాఖ అనుమతి అవసరం.
శామీర్పేట, మేడ్చల్ కారిడార్లను తక్కువ ఎత్తులో నిర్మించేలా డిజైన్
బేగంపేట విమానాశ్రయం రన్వే కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎత్తు పరిమితులు అమలులో ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని శామీర్పేట, మేడ్చల్ కారిడార్లను తక్కువ ఎత్తులో నిర్మించేలా డిజైన్ చేశారు. రైల్వే క్రాసింగ్లు కూడా కీలక సవాలుగా మారనున్నాయి. ఫలక్నుమా, ఆరాంఘర్, శంషాబాద్, గుండ్లపోచంపల్లి, లోతుకుంట, అల్వాల్ ప్రాంతాల్లో మెట్రో మార్గం రైల్వే ట్రాక్లను దాటాల్సి ఉంటుంది.
ఆ జాతీయ రహదారుల వెంట మెట్రో స్తంభాల నిర్మాణానికి కేంద్ర అనుమతులు
దీనికోసం దక్షిణ మధ్య రైల్వే నుంచి సూత్రప్రాయ అనుమతి లభించినట్లు అధికారులు తెలిపారు. సుచిత్ర ప్రాంతంలో మాత్రం అనుమతి ఇంకా పెండింగ్లో ఉంది. జాతీయ రహదారుల వెంట కూడా రైట్ ఆఫ్ వే అనుమతులు కీలకం. మదీనాగూడ-పటాన్చెరు, చింతలకుంట-హయత్నగర్ మార్గాల్లో ఎన్హెచ్-65, ఆరాంఘర్-శంషాబాద్, బోయిన్పల్లి-మేడ్చల్ మార్గాల్లో ఎన్హెచ్-44 పరిధిలో మెట్రో స్తంభాల నిర్మాణానికి కేంద్ర అనుమతులు అవసరం.
రెండో దశలో ఏడు కారిడార్లలో 122.9 కిలోమీటర్ల మెట్రో మార్గం
మొత్తంగా రెండో దశలో ఏడు కారిడార్లలో 122.9 కిలోమీటర్ల మెట్రో మార్గం, 86 స్టేషన్లు ప్రతిపాదించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.38,595 కోట్లు. పూర్తయిన తర్వాత రోజుకు సుమారు 12.42 లక్షల మంది ప్రయాణికులు ఉపయోగించే అవకాశం ఉంది. నిధుల్లో కేంద్రం వాటా రూ.6,666 కోట్లు, రాష్ట్రం వాటా రూ.11,933 కోట్లు, రుణాల ద్వారా రూ.19,996 కోట్లు సమీకరించనున్నారు.
మెట్రో రైలు ప్రాజెక్ట్ రవాణా వ్యవస్థలో కీలకం
జీహెచ్ఎంసీ పరిధిలో 36.5 కి.మీ., మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లో 24.9 కి.మీ., సైబరాబాద్లో 41.3 కి.మీ. మేర విస్తరణ జరుగుతుంది. అనుమతుల ప్రక్రియ పూర్తయితే హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ రవాణా వ్యవస్థలో కీలకంగా ఉండనుంది. భూగర్భ మెట్రో రైల్ మార్గాలు ఈ ప్రాంతాల్లో సక్సెస్ అయితే భవిష్యత్ లో మరిన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంటుంది.












Click it and Unblock the Notifications