వేడి వేడి రాడ్స్తో వాతలు పెట్టారు: నెమరేసుకుంటున్న ప్రత్యూష
హైదరాబాద్: తల్లిదండ్రుల చేతిలో చిత్రహింసలు అనుభవించిన హైదరాబాద్ అమ్మాయి ప్రత్యూష క్రమంగా కోలుకుంటోంది. తల్లిదండ్రులు తన దేహంపై వేడి వేడి రాడ్స్తో వాతలు పెట్టారని అంటోంది. 19 ఏళ్ల ప్రత్యూషను గ్లోబల్ ఆస్పత్రిలో ప్రత్యేక గదిలోకి మార్చారు.
ఇప్పుడు ఆమె అందరు టీనేజీ అమ్మాయిల మాదిరిగానే కనిపిస్తోంది. అయితే, చేతులపై, ముఖంపై, మెడపై వాతలు పెట్టిన మచ్చలు కనిపిస్తూనే ఉన్నాయి. తనను జాగ్రత్తగా చూసుకునే మనుషుల మధ్యకు వస్తానని తాను ఎన్నడూ అనుకోలేదని అంటోంది.
జీవితంలో వేడి వేడి ఇనుప రాడ్స్ వాతలు, పాచిపోయి పులిసిపోయిన ఆహారం తప్ప జీవితంలో తనకు మరేది ఉండదని అనుకునే దాన్నని ఆమె చెప్పింది. నిరుడు రెండుసార్లు పారిపోవడానికి చేసిన ఆమె ప్రయత్నం ఫలించలేదు. తల్లిదండ్రులతో పాటు ఆమె నివసించే ఫతుల్లాగుడాలో ఆమె పట్ల తీవ్రమైన విషప్రచారం చేశారు. దీంతో ఆమె వేసిన కేకలను గానీ ఆమె చెప్పే మాటలను గానీ ఎవరూ పట్టించుకునేవారు కాదు.
దాంతో ఆమె రెండు సార్లు చేసిన ప్రయత్నం కూడా తండ్రి రమేష్, సవతి తల్లి చాముండేశ్వరి అలియాస్ శ్యామల సంకెళ్ల నుంచి స్వేచ్ఛను ప్రసాదించలేకపోయింది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వొకేషనల్ మల్టీపర్పస్ వర్కర్స్ కోర్సు చదువుతుండగా ప్రత్యూష తల్లి సరళ 2010లో మరణించింది. సరళ సోదరుడు ఆమెను తీసుకుని వెళ్లాడు.
తమ తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న తర్వాత పద్మారావునగర్కు మారామని, తన మామ ముషీరాబాద్లో ఉండేవాడని, అమ్మమ్మ వారాసిగూడాలో ఉండేదని, తాను మామ వద్ద ఉండడానికి వెళ్లానని, అయితే కొద్ది రోజుల్లోనే తనను అనాథాశ్రమానికి పంపించారని, వారి ఫోన్ నెంబర్ కూడా తనకు ఇవ్వలేదని ప్రత్యూష చెబుతోంది.
తన తండ్రి 2014లో తన వద్దకు వచ్చేవరకు తాను ఎక్కడున్నాననే విషయం బంధువులకు తెలియదని ఆమె చెబుతోంది. తన తండ్రి నాలుగు సార్లు వచ్చి తనతో రమ్మన్నాడని, అయితే తాను వెళ్లడానికి నిరాకరించానని, చివరగా నాలుగో సారి తనను నమ్మించి తీసుకుని వెళ్లాడని ఆమె చెబుతోంది. మొదటి రెండు నెలలు ఏ విధమైన సమస్యలూ ఎదురు కాలేదని చెబుతోంది. ఆ తర్వాత తనకు ఆహారం రెండు సార్లు మాత్రమే పెట్టడం ప్రారంభించారని, కొట్టడం కూడా మొదలు పెట్టారని చెప్పింది.