పొన్నాలకు షాక్: టి పిసిసి చీఫ్గా ఉత్తమ్కుమార్
హైదరాబాద్: తెలంగాణ పిసిసి చీఫ్గా కొనసాగుతున్న పొన్నాల లక్ష్మయ్యకు ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ అధిష్టానం పొన్నాల లక్ష్మయ్యను తెలంగాణ పిసిసి చీఫ్ పదవి నుంచి తప్పించింది. తెలంగాణ పిసిసి చీఫ్గా పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించింది.
హుజూర్నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ...కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. పార్టీని బలోపేతం చేయడానికే ఈ మార్పు చేసినట్లు సీనియర్ నేతలు అంటున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మల్లు భట్టి విక్రమార్క నియామకం అయ్యే అవకాశం ఉంది.
మరోవైపు తెలంగాణ సిఎల్పీ నేత జానారెడ్డిని తక్షణమే హస్తినకు రావాలని హైకమాండ్ ఆదేశించింది. కాగా పొన్నాల పనితీరుపై కాంగ్రెస్ అధిష్టానం కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఆయన నాలుగు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. అయినా పొన్నాలకు టెన్ జన్ పథ్ అపాయింట్ మెంట్ దొరకలేదు. పొన్నాలతో పాటు పలువురు సీనియర్ నేతలు ఢిల్లీలోనే ఉన్నారు.
కాగా, ఉత్తమ్కి కాంగ్రెస్ పార్టీలో వివాదరహితుడిగా మంచి పేరుంది. రాజీవ్ గాంధీ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు కూడా. అంతే కాకుండా ఆర్మీలో వివిధ పదవుల్లో సుదీర్ఘంగా పని చేసిన అనుభవం ఉంది. ఎయిర్ఫోర్స్లో మిగ్ విమానాలకు పైలెట్గా పని చేశారు. రాష్ట్రపతి భవన్ సెక్యూరిటీ చీఫ్గా సేవలందించారు.
వైఎస్ హయాంలో 610 జీఓ చైర్మన్గా సేవలందించారు. కోదాడ నుంచి రెండు సార్లు, హుజూర్నగర్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్. కిరణ్కుమార్రెడ్డి మంత్రివర్గంలో గృహ శాఖ మంత్రిగా పని చేశారు. ఉత్తమ్కుమార్రెడ్డి స్వస్థలం తాటిపాముల గ్రామం, తిరుమలగిరి మండలం, నల్లగొండ జిల్లా. ఉత్తమ్ భార్య పద్మావతి. ప్రస్తుతం కోదాడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పద్మావతి కొనసాగుతున్నారు.