చిరంజీవి, బాలయ్య ఫ్యాన్స్కు జగన్ ప్రభుత్వం సంక్రాంతి కానుక- తెలంగాణ కూడా..!!
అమరావతి: రాష్ట్రంలో సంక్రాంతి సందడి ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ఈ నెల 12వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. 18వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అదే రోజున భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాయి. కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న మాస్ మూవీస్ ఈ రెండు కూడా. నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య.. ఒక్కరోజు తేడాతో విడుదల కానున్నాయి.
ఎల్లుండి వీర సింహా రెడ్డి ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపీచంద్ మలినేని దర్శకుడు. శృతిహాసన్ హీరోయిన్. ఇటీవలే ఒంగోలులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ను జరుపుకొంది. బాలకృష్ణ మాస్ లుక్ లో కనిపించారిందులో. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్యకు కేఎస్ రవీంద్ర దర్శకుడు. రవితేజ ప్రత్యేక పాత్రను పోషించారు. ఇందులో కూడా శృతిహాసన్ కథానాయిక.
ఈ రెండు సినిమాలను కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. ఆదివారం విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుకుంది చిత్రం యూనిట్. ఈ రెండూ కూడా భారీ బడ్జెట్ సినిమాలే. అదే స్థాయిలో ప్రేక్షకుల అంచనాలు కూడా ఉన్నాయి. అఖండ తరువాత బాలకృష్ణ నటించిన మూవీ వీరసింహారెడ్డి. అఖండ సూపర్ హిట్ గా నిలిచింది.
ఆచార్య తరువాత చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేర్ వీరయ్య. ఆచార్య మూవీ గ్రేట్ డిజాస్టర్. మెగాస్టార్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది సినిమా. పూల చొక్కా, గళ్ల లుంగీలో మెగాస్టార్ ప్యూర్ మాస్ లుక్స్ లో కనిపించారు. ఆయనకు తోడుగా మాస్ మహారాజా రవితేజ కూడా తెరను పంచుకోవడం సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది.
ఈ రెండు సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శుభవార్తను వినిపించాయి. టికెట్ల రేట్లను పెంచుకోవడానికి అనుమతి ఇచ్చాయి. అలాగే బెనిఫిట్ షోను ప్రదర్శించుకోవడానికీ అంగీకరించాయి. విడుదల రోజు మాత్రమే ఆరు షోలను ప్రదర్శించడానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది.
ఈ నెల 12వ తేదీన వీరసింహా రెడ్డి, 13వ తేదీన వాల్తేర్ వీరయ్య సినిమాలు తెలంగాణలోని అన్ని థియేటర్లల్లో ఆరు షోలను ప్రదర్శించడానికి అనుమతి లభించింది. తెల్లవారు జామున 4 గంటలకు స్క్రీనింగ్ మొదలవుతుంది. ఒక్కరోజు మాత్రమే అంటే.. విడుదల రోజు మాత్రమే ఆరు షోలకు అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.
ఇక ఏపీ ప్రభుత్వం టికెట్లను రేట్లను పెంచుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది. ఒక్కో టికెట్ పై అదనంగా 45 రూపాయలను వసూలు చేసుకునే వెసలుబాటును కల్పించింది ఏపీ ప్రభుత్వం. దీనికి జీఎస్టీ అదనం. కాగా అటు ఆరు షోలను ప్రదర్శించుకోవడానికి ప్రభుత్వాలు అంగీకరించడం అభిమానుల్లో జోష్ నింపింది.