జగన్కు టీలో మరో షాక్: తెరాసలోకి విజయ, క్యూలో..
తెలంగాణ భవన్లో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రాజ్యసభ సభ్యుడు కే కేశవ రావు, తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డిల సమక్షంలో ఆమె తెరాస తీర్థం పుచ్చుకున్నారు.
మధ్యాహ్నం ఆమె ఖైరతాబాదులోని పీజేఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక మహంకాళీ ఆలయం వద్ద పూజలు చేశారు. తెరాస పార్టీ కార్యాలయానికి ర్యాలీగా వచ్చారు. మంత్రి పద్మారావు ఈ ర్యాలీని ప్రారంభించారు. ఒంటెలు, గుర్రాలు, ద్విచక్ర వాహనాలతో పెద్దఎత్తున కార్యకర్తలతో కలిసి ఆమె తెలంగాణ భవన్ వచ్చి గులాబీ కండువా కప్పుకున్నారు.
కాగా, ఇప్పటికే తెలంగాణలోని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు తెరాసలోకి వెళ్లనున్నారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వర రావు తెరాసలోకి వస్తారని ఆ పార్టీ ధీమాగా చెబుతోంది. టీడీపీ, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పలువురు తెరాస వైపు చూస్తున్నారు.