విజయారెడ్డి సజీవదహనం కేసు ... అటెండర్ చంద్రయ్య పరిస్థితి విషమం
విజయారెడ్డి సజీవ దహనం కేసులో విజయారెడ్డిని కాపాడే ప్రయత్నం చేసిన అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ ఆఫీసు అటెండర్ చంద్రయ్య అరోగ్య పరిస్థితి విషమంగా మారింది. తహసీల్దార్ విజయారెడ్డిని కాపాడే ప్రయత్నంలో చంద్రయ్య గాయాల పాలయ్యారు. ప్రస్తుతం డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చంద్రయ్య చికిత్స పొందుతున్నాడు. విజయారెడ్డి సజీవ దహనం కేసులో ఆమెను సజీవదహనం చేసిన సురేష్, అలాగే ఈ ఘటనలో కాలిన గాయాలతో విజయారెడ్డి డ్రైవర్ గురునాథ్ మరణించిన విషయం తెలిసిందే.
ఇక నాడు జరిగిన ఘటనలో తహసీల్దార్ విజయారెడ్డిని కాపాడే ప్రయత్నం చేసిన అటెండర్ చంద్రయ్యను ఆఫీసు సిబ్బంది కానీ, ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకోలేదని చంద్రయ్య కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని అతని కుటుంబసభ్యులు సైతం హెచ్చరిస్తున్నారు.
చంద్రయ్య వైద్యానికి ఇప్పటికే మూడు లక్షల బిల్లు అయిందని కుటుంబ సభ్యులకు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. డబ్బు చెల్లిస్తే చికిత్స చేస్తామంటూ ఆస్పత్రి సిబ్బంది పేర్కొందని వారు చెప్తున్నారు.
ఇక చంద్రయ్యకు ఇప్పటి వరకు అయిన వైద్య ఖర్చులు చెల్లించి తీసుకెళ్లాలని ఆస్పత్రి యాజమాన్యం చెప్పింది. ఆయన పరిస్థితి సీరియస్ గా ఉన్న నేపధ్యంలో ఇప్పటి వరకు అయిన బిల్ చెల్లిస్తేనే ఆయనకు చికిత్స చేస్తామని చెప్పారు. దీంతో ప్రభుత్వాధికారులు గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించారు.తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనమైన ఘటనలో విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించిన అటెండర్ చంద్రయ్యకు కూడా మంటలంటుకొని గాయాల పాలయ్యారు. ఇప్పుడు ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు .