సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విజయశాంతి!!
కేసీఆర్ ను టార్గెట్ చేసిన బిజెపి నాయకురాలు విజయశాంతి ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మీడియా నుండి తప్పించుకోవడానికి కెసిఆర్ ఆసుపత్రిలో చేరి ఉంటారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఆదివారం ఉదయం గ్యాస్ట్రిక్ సమస్యతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను గచ్చిబౌలి లేని ఏఐజి ఆసుపత్రికి తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి నేతృత్వంలోని వైద్య బృందం కెసిఆర్ కు అనేక పరీక్షలు నిర్వహించి ఆయన కడుపులో చిన్న అల్సర్ ఉన్నట్టు గుర్తించినట్టు పేర్కొన్నారు.

కేసీఆర్ అస్వస్థత.. ప్రతిపక్షాల ఆరోపణలు
కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సీఎం కేసీఆర్ ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించారు. మందులతో తగ్గిపోతుందని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇక వైద్య పరీక్షల అనంతరం తిరిగి ప్రగతి భవన్ కు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. కెసిఆర్ ఆసుపత్రికి వెళ్ళిన సమయంలో కేసీఆర్ వెంట సతీమణి శోభ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ స్పీకర్ మధుసూదనా చారి తదితరులు ఉన్నారు. ఇదిలా ఉంటే కవితను ఈ డి విచారించిన తర్వాత రోజు కేసీఆర్ అస్వస్థతకు గురి కావడంతో ప్రతిపక్షాలు కేసీఆర్ అస్వస్థతను కూడా టార్గెట్ చేయడం ప్రధానంగా కనిపిస్తుంది.

కేసీఆర్ ఆస్పత్రిలో చేరిక అందుకే: విజయశాంతి వివాదాస్పద వ్యాఖ్యలు
ఇక కేసీఆర్ ను టార్గెట్ చేసిన బిజెపి నాయకురాలు విజయశాంతి ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మీడియా నుండి తప్పించుకోవడానికి కెసిఆర్ ఆసుపత్రిలో చేరి ఉంటారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టిన విజయశాంతి కెసిఆర్ గారు మీకు అనారోగ్యమని హాస్పిటల్ లో అడ్మిట్ అవుతారు. ఇక బి ఆర్ ఎస్ నాయకులందరూ ఈడీ విచారణ దుర్మార్గమంటారు అంటూ పేర్కొన్నారు. ఇంత జరిగిన తర్వాత అయినా నా కుటుంబ సభ్యులు ఎవరికీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో కానీ, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఇంకే అవినీతితో గాని ఏ విధమైన సంబంధం లేదు అని కెసిఆర్ గారు ఎందుకు చెప్పరు అంటూ ప్రశ్నించారు.

ఆరోపణలు నిజమైతే రాజకీయాల నుండి వైదొలుగుతాం అని ఎందుకు చెప్పరు?
అంతేకాదు నేను నిప్పులాంటి మనిషిని, నిజాయితీ ఉన్న నేతను అని, ఆరోపణలు నిజమని తేలితే రాజకీయాల నుంచి మా కుటుంబమంతా వైదొలుగుతామనే మాట మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటూ ప్రశ్నించారు. మీడియా నుంచి తప్పించుకోవడానికి, సమాధానం వెతుక్కునే ప్రయత్నానికి సమయం కోసమే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసుపత్రిలో చేరి ఉంటారని తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారని విజయశాంతి కేసీఆర్ ఆరోగ్యం పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

విజయ శాంతి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకుల మండిపాటు
విజయశాంతి తన వ్యాఖ్యల ద్వారా కెసిఆర్ ఆస్పత్రిలో చేరిక కేవలం ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి మాత్రమే అంటూ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే విజయశాంతి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్ కు అనారోగ్యంగా ఉందంటే దానిపైన కూడా రాజకీయాలు మాట్లాడతారా అంటూ నిప్పులు చెరుగుతున్నారు. కవిత విచారణకు కేసీఆర్ ఆరోగ్యానికి లింక్ పెట్టి ఎలా మాట్లాడతారని ప్రశ్నిస్తునారు. ఈ తరహా రాజకీయాలు చేస్తున్న బిజెపి నాయకులకు వచ్చే ఎన్నికలలో తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పి తీరుతారని అంటున్నారు.












Click it and Unblock the Notifications