బీజేపీ నేతల పాదయాత్రలంటే... కేసీఆర్ గుండెలమీద తంతున్న ఇనుప పద ఘట్టనల్లా ఫీలింగ్!!
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పాదయాత్ర అంటే కెసిఆర్ కు వెన్నులో వణుకు పుడుతోందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. అందుకే అడుగడుగున అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని నిప్పులు చెరుగుతున్నారు. ఇక తాజాగా నిన్న బండి సంజయ్ పాదయాత్ర నేపథ్యంలో పాదయాత్రకు అనుమతి నిరాకరించి, బండి సంజయ్ ను అరెస్ట్ చేసి కెసిఆర్ ప్రభుత్వం పాదయాత్రను అడ్డుకోవడానికి శతవిధాలా చేసిన ప్రయత్నం పై బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి తనదైన శైలిలో స్పందించారు.
బీజేపీ నేతల పాదయాత్రలంటే... అవేవో తన గుండెల మీద తన్నుతున్న ఇనుప పద ఘట్టనల్లా సీఎం కేసీఆర్ కు అనిపిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోందని విజయశాంతి వ్యాఖ్యానించారు. బీజేపీ పాదయాత్రల దెబ్బకు కేసీఆర్ గుండె గుభేల్లుమంటోందని తన వ్యాఖ్యల ద్వారా విజయశాంతి చెప్పారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ భైంసా పాదయాత్ర అనే సరికి కేసీఆర్ కి, ఆయన గారి టిఆర్ఎస్ పార్టీకి సయామీ కవల పార్టీ అయిన ఎంఐఎం పెద్దలకు మరికాస్త వణుకు పుట్టిందని విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు .

మతపరంగా సున్నితమైన ప్రాంతమని, సమస్యాత్మకమని చెప్పి పాదయాత్రకు అనుమతి రాకుండా చేశారని మండిపడిన విజయశాంతి పాదయాత్రను అడ్డుకోవడానికి చెప్పిన కారణంతో కేసీఆర్ సర్కార్ ఫెయిల్ అయింది అని ఒప్పుకున్నట్టే నని స్పష్టం చేశారు. నిజానికి భైంసా వెళ్లకుండా బండి సంజయ్ ను ఆపడమంటే... తాము ఇప్పటికీ భైంసాను శాంతియుత ప్రాంతంగా మార్చలేకపోయామని రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఒప్పుకోవడం గాక మరేంటి? అంటూ విజయశాంతి ప్రశ్నించారు.
బీజేపీ అధ్యక్షుడు భైంసా వెళ్లకుండా అడ్డుకోవడం కేసీఆర్ ప్రభుత్వం గొప్ప గాదు.... ఆ సమస్యాత్మక ప్రాంతంలోని పరిస్థితుల్ని నేటికీ ఎంతమాత్రం మెరుగుపరచలేకపోయిన తెలంగాణ సర్కారు చేతగానితనం అంటూ విజయశాంతి కెసిఆర్ అసమర్థ పాలనను చెప్పే ప్రయత్నం చేశారు. బండి సంజయ్ భైంసా వెళితే... తమ సర్కారు వైఫల్యాలన్నిటినీ మరింతగా బట్టబయలు చేస్తారనే భయంతోనే సర్వశక్తులూ ఒడ్డి ఆగమేఘాల మీద ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు జరిగాయని విజయశాంతి నిప్పులు చెరిగారు. ప్రభుత్వం ఎంత బిజెపి నాయకుల పాదయాత్రలను అడ్డుకోవాలనే ప్రయత్నం చేసినా, సాధ్యం కాదని.. కచ్చితంగా పాదయాత్ర చేసి తీరుతామని, కెసిఆర్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తామని విజయశాంతి తెలిపారు.












Click it and Unblock the Notifications