మహిళా ఓటర్లే అధికం: ఎన్నికల ఏర్పాట్లపై వికాస్ రాజ్ కీలక ప్రకటన, రైతుబంధు, డీఏపై ఇలా
హైదరాబాద్: రాష్ట్రంలో దాదాపు ఇప్పటికే ఓటర్ స్లిప్పులను పంపిణీ చేశామని తెలిపారు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ (Vikas Raj). హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఆయన గురువారం మాట్లాడుతూ.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పరిస్థితి, ఏర్పాట్లను వివరించారు. పోలింగ్ కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయన్నారు. ప్రస్తుతం ఓటింగ్, ఫెసిలిటేషన్ కేంద్రాల్లో పోస్టల్ ఓటింగ్ జరుగుతోందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 9174 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.
రాష్ట్రంలో మొదటిసారి మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందన్న సీఈవో ఓటర్ల నిష్పత్తి 1000:1002 ఉన్నట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం బ్యాలెట్లు, టెండర్, చాలెంజ్ ఓట్ల కోసం బ్యాలెట్లు కలిపి మొత్తం 14 లక్షలకుపైగా ముద్రణ పూర్తయిందని.. రేపటితో ఈవీఎం, వీవీప్యాట్ల కమిషనింగ్ పూర్తవుతుందని చెప్పారు.35,655 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. 59,779 బ్యాలెట్ యూనిట్లు వాడుతున్నట్లు వికాస్ రాజ్ వివరించారు. అభ్యర్థులకు ఓటరు జాబితాలు అందించినట్లు తెలిపారు.

ఇప్పటి వరకు 51 లక్షల ఓటరు గుర్తింపు కార్డులు ముద్రించినట్లు సీఈవో చెప్పారు. ఇప్పటి వరకు 86 శాతం ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ పూర్తయిందని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో స్లిప్పుల పంపిణీ పూర్తవుతుందన్నారు. 9 చోట్ల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఆరు నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని.. అక్కడ కౌంటింగ్ కేంద్రాల్లో టేబుళ్లు రెట్టింపు సంఖ్యలో ఉంటాయని సీఈఓ తెలిపారు. సువిధ యాప్ ద్వారా అనుమతుల కోసం 37,422 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద 777 కేసులు నమోదు అయ్యాయని, అందులో 166 ప్రలోభాలకు సంబంధించి కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు. నమూనా పోలింగ్ స్టేషన్లు, యువత, దివ్యాంగులు నిర్వహించే పోలింగ్ కేంద్రాలు ఉంటాయన్నారు. పోలింగ్ రోజు సెలవు రోజుగా చూడరాదన్న.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల విధుల్లో 40 వేల రాష్ట్ర పోలీసులు, 25 వేల ఇతర రాష్ట్రాల పోలీసులు, 375 కంపెనీల కేంద్ర బలగాలు ఉంటాయని సీఈవో తెలిపారు. శాంతి భద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు సీఈవో తెలిపారు.
కాగా, సీ జిల్ యాప్ను ఇప్పటి వరకు 6648 మంది వినియోగించినట్లు సీఈవో వికాస్ రాజ్ చెప్పారు. ఈవీఎంలు తీసుకెళ్లే ప్రతి వాహనానికి జీపీఎస్ సౌకర్యం ఉంటుందని అన్నారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం రూ.669 కోట్లుగా తెలిపారు. స్వాధీనాలకు సంబంధించి 10,106 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు వికాస్ రాజ్ వెల్లడించారు. మరోవైపు, రైతుబంధు, డీఏ చెల్లింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిణ వివరణలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపామని, ఈసీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు వికాస్ రాజ్ తెలిపారు.












Click it and Unblock the Notifications