కేసీఆర్ ఒక్కడే మొనగాడా... ఖబడ్దార్.. మంత్రి జగదీశ్ రెడ్డి,ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాటల యుద్ధం...
తెలంగాణవ్యాప్తంగా సోమవారం(జులై 26) నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో ఇవాళ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కార్యక్రమం రసాభాసగా మారింది.
మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆయన చేతిలో నుంచి మైక్ లాగేసుకున్నారు. దీంతో జగదీశ్ రెడ్డి,టీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు కూడా అంతే స్థాయిలో స్పందించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. దీంతో సభలో కాసేపు ఉద్రిక్తత తలెత్తింది.
కార్యక్రమం నుంచి మధ్యలోనే బయటకొచ్చిన రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగదీశ్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.'అధికారిక కార్యక్రమానికి గౌరవ ప్రతిపక్ష ఎమ్మెల్యేకి సమాచారం అని తెలియదా. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. వాళ్లు వాళ్ల గొప్పలు చెప్పుకోవాలి గానీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందనే విషయాన్ని మాత్రం మేము చెప్పవద్దట. కేసీఆర్ ఒక్కడే మొనగాడా... ఆయనొక్కడి వల్లే తెలంగాణ వచ్చిందా.. అప్పుడు టీఆర్ఎస్ తరుపున కేసీఆర్ ఒక్కడే ఎంపీ,కాంగ్రెస్ తరుపున మేం 12 మందిమి పోరాటం చేశాం. ఎంతసేపు గొప్పలు చెప్పుకునుడేనా... సిగ్గు,శరం లేదు మంత్రికి...' అంటూ రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు.
హుజురాబాద్కు రూ.2వేల కోట్లు ఇస్తున్నారని... నల్గొండకు రూ.200 కోట్లు తీసుకురాలేకపోతున్నారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. జిల్లాలో ఉదయ సముద్రం ప్రాజెక్టు ఏడేళ్లయినా ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలోనే 90శాతం పూర్తయిన ప్రాజెక్టును ఈ ఏడేళ్లలో 10 శాతం పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు. మంత్రి జగదీశ్ రెడ్డిని ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.
Recommended Video
మంత్రి జగదీశ్ రెడ్డి సైతం రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. కేవలం మనుగడ కోల్పోతున్నామనే బాధతోనే ఈ చిల్లర వేషాలు వేస్తున్నారని విమర్శించారు. ఎంతసేపు ఇవే చిల్లరమల్లర వేషాలతో మీడియాలో ఉండాలనే తాపత్రయమే తప్ప ప్రజల కోసం పనిచేసే ఆలోచన లేదన్నారు. అభివృద్ది కోసం కొట్లాడాలే గానీ ప్రతిపక్ష నాయకులు అభివృద్దిని అడ్డుకుని ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మిషన్ భగీరథ,కాళేశ్వరం,పాలమూరు... ఇలా ప్రతీ ప్రాజెక్టును ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలు పార్టీలను నిలబెట్టవని... పైగా ప్రజలకు మరింత దూరం చేస్తాయని అన్నారు.