వరంగల్ కలెక్టరేట్ లో కుప్పకూలిన వృద్ధుడు.. సీపీఆర్ తో ఊపిరి పోసిన డీఎంహెచ్ఓ!!
వరంగల్ కలెక్టరేట్లో కుప్పకూలిన వృద్ధుడిని డీఎంహెచ్ఓ వెంకటరమణ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. జిల్లా కలెక్టర్ గోపితోపాటు స్థానికులు, అధికారులు ఆయనను అభినందించారు.
ఇటీవల కాలంలో వయసుతో నిమిత్తం లేకుండా, చిన్న పెద్ద అన్న బేధం లేకుండా గుండెపోటుకు గురై ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. అయితే సిపిఆర్ చేయడం తెలిసుంటే, గుండెపోటును వెంటనే గుర్తించగలిగితే ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడటానికి అవకాశం ఉంటుందని అనేక ఉదంతాలు స్పష్టం చేశాయి.

వృద్ధుడికి సిపిఆర్ చేసి ఊపిరి పోసిన డీఎంహెచ్వో
ఇటీవల రాజేంద్రనగర్ సెంటర్లో బస్సు దిగిన ఒక యువకుడు కుప్పకూలిపోతే, ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ యువకుడికి సిపిఆర్ చేసి ప్రాణం పోసిన విషయం మరిచిపోక ముందే, వరంగల్ కలెక్టరేట్లో గ్రీవెన్స్ కు వచ్చిన ఒక వృద్ధుడు హఠాత్తుగా కుప్పకూలి పడిపోగా, గ్రీవెన్స్ లో ప్రజల నుంచి వినతులు తీసుకుంటున్న వరంగల్ డిఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ వెంటనే స్పందించి వృద్ధుడికి సిపిఆర్ చేసి ఊపిరి పోశారు.

గ్రీవెన్స్ కు వచ్చి కుప్పకూలిన వృద్ధుడు
ఇక ఈ ఘటన వివరాల్లోకి వెళితే సోమవారం నాడు వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి మొగిలి అనే ఒక వృద్ధుడు భూ సమస్య పరిష్కారం కోసం వరంగల్ కలెక్టరేట్లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కి వచ్చాడు. కలెక్టర్ కు తన సమస్యను విన్నవించుకోవాలని వచ్చిన వృద్ధుడు కూర్చున్న చోటే హఠాత్తుగా కుప్పకూలి కింద పడిపోయాడు. శ్వాస ఆగిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు.

వృద్ధుడి ప్రాణాలు కాపాడిన డీఎంహెచ్ఓ
వెంటనే అక్కడే ఉన్న వరంగల్ డిఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ మొదట వృద్ధుని ఛాతీపై చెయ్యి పెట్టి సిపిఆర్ చేసి వృద్ధుడికి ఊపిరి పోశారు. ఆపై 108 ఎమర్జెన్సీ అంబులెన్స్ ద్వారా ఎంజీఎం ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఎవరైనా ఇలా అకస్మాత్తుగా కుప్పకూలిపోతే శ్వాస తీసుకోవటం కూడా ఆగిపోతే వెంటనే సీపీఆర్ చేస్తే వ్యక్తి ప్రాణం కాపాడవచ్చని ఆయన చెప్పారు. ప్రతీ ఒక్కరూ ప్రస్తుత సమాజంలో సీపీఆర్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

డీఎంహెచ్వో వెంకటరమణకు అభినందనల వెల్లువ
గ్రీవెన్స్ కు వచ్చిన వృద్ధుడు మొగిలి కింద పడిపోతే వెంటనే స్పందించి సిపిఆర్ చేసి ఊపిరి వచ్చేలా చేసిన డిఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణను ప్రజావాణి కార్యక్రమంలో ఉన్న జిల్లా కలెక్టర్ బీ. గోపి, అధికారులు, అక్కడికి వచ్చిన జిల్లా వాసులు సైతం అభినందిస్తున్నారు. వృద్ధుడి ప్రాణాలు కాపాడారని కొనియాడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై స్పందించిన మొగిలి కుమారుడు వెంకటేశ్వర్లు తన తండ్రి ఎవరికీ చెప్పకుండా కలెక్టరేట్ కు వచ్చాడని, ఆయన ఎక్కువ సేపు నడిస్తే ఆయాసంతో ఇబ్బంది పడతారని, థైరాయిడ్ సమస్యతో కూడా తన తండ్రి బాధపడుతున్నాడని చెప్పారు. తన తండ్రి ప్రాణాలు కాపాడిన డీఎంహెచ్ఓకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఎంజీఎం ఏఎంసీలో చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు.












Click it and Unblock the Notifications