టిక్కెట్ రాలేదని ఆందోళన వద్దు, వేరే పదవి: కెసిఆర్, వరంగల్ అభ్యర్థిగా గుడిమళ్ల!
హైదరాబాద్: పార్లమెంటుకు వెళ్లే వ్యక్తి చదువుకొని ఉండాలనేది తన లక్ష్యమని, టిక్కెట్ రాలేదని ఎవరూ ఆందోళన చెందవద్దని, టిక్కెట్ ఆశించిన వారికి నామినేటెడ్ పోస్టులను ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం అన్నారు.
కేసీఆర్ పార్టీ ముఖ్యనేతలు, వరంగల్ జిల్లా నేతలతో తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థిని నిర్ణయించే అధికారం కేసీఆర్కే కట్టబెడుతూ... సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. పార్టీ అభ్యర్థిగా గుడిమళ్ల రవికుమార్ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వరంగల్ పార్లమెంట్ ఉపఎన్నికలో అభ్యర్థిని టిఆర్ఎస్ రేపు ప్రకటించే అవకాశం ఉంది. కెసిఆర్ రేపు దీనిపై ప్రకటన చేయనున్నారు. కాగా, పార్టీ నేతలతో సమావేశం సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. టిక్కెట్ ఆశించిన వారికి నామినేటెడ్ పోస్టులతో భర్తీ చేస్తామన్నారు.

పార్లమెంటుకు వెళ్లే వ్యక్తి హిందీ, ఇంగ్లీష్, తెలుగు వచ్చి ఉండాలని, చదువుకొని ఉండాలని అభిప్రాయపడ్డారు. టిక్కెట్ ఎవరికి ఇచ్చినా సమష్టిగా కృషి చేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. వరంగల్ అభ్యర్థి కోసమే నామినేటెడ్ పోస్టుల భర్తీని ఆపామని చెప్పారు.
రేపు అభ్యర్థిని ప్రకటిస్తాం: కడియం శ్రీహరి
వరంగల్ లోకసభకు టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేయనున్న అభ్యర్థి పేరును రేపు ప్రకటించనున్నట్టు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. రేపు పార్టీ అధ్యక్షులు కెసిఆర్ అభ్యర్థిని ప్రకటిస్తారని వెల్లడించారు. వరంగల్ జిల్లాకు చెందిన వారికి, ఉద్యమంలో పాల్గొన్న వారికే పార్టీ దక్కుతుందని గతంలో చెప్పామని ఇప్పుడూ అదే చెబుతున్నామని తెలిపారు. పార్టీ అధ్యక్షుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారని పేర్కొన్నారు.
మంత్రులకు బాధ్యతలు
వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రులకు కెసిఆర్ బాధ్యతలు అప్పగించారు. వరంగల్ తూర్పు - హరీష్ రావు, వరంగల్ వెస్ట్ - కెటి రామారావు, భూపాలపల్లి - పోచారం శ్రీనివాస్ రెడ్డి, పరకాల - ఈటెల రాజేందర్, వర్దన్నపేట - జోగు రామన్న, స్టేషన్ ఘనపూర్ - ఇంద్రకరణ్ రెడ్డి, పాలకుర్తి - జగదీశ్వర్ రెడ్డి. కాగా, నవంబర్ 17, 18 తేదీల్లో కెసిఆర్ వరంగల్లో ప్రచారం చేయనున్నారు.












Click it and Unblock the Notifications