రాజయ్య ఖైదీ నెం.2971: సనా పాత్ర ఎంత? అధికారంలో ఉన్నా.. సారిక కేసులో షాకింగ్
వరంగల్: కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారుల అనుమానాస్పద మృతి కేసులో మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిరిసిల్ల రాజయ్య, ఆయన కుటుంబ సభ్యులను వరంగల్ సెంట్రల్ జైలులో ఉంచారు. శుక్రవారం వారికి ఖైదీ నంబర్లు కేటాయించారు.
మాజీ ఎంపీ రాజయ్యకు ఖైదీ నంబర్ 2971, కుమారుడు అనిల్కు 2970, రాజయ్య భార్య మాధవిని మహిళా కారాగారానికి తరలించి 7856 నంబర్ కేటాయించారు. మరోవైపు, పోలీసులు అనిల్ రెండో భార్య సన కోసం గాలిస్తున్నారు. మరోవైపు ఆమె పోలీసుల అదుపులో ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
సారిక గతంలో బేగంపేట పోలీసు స్టేషన్లో రాజయ్య కుటుంబంతో పాటు సన పైన కూడా ఫిర్యాదు చేసింది. దీంతో సారిక మృతి కేసులో సన పాత్ర పైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ కేసులో రాజయ్య పేరు తొలగించినప్పటికీ సన పైన కేసు కొనసాగుతోంది. సన కూడా సారికను వేధించిందన్నా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

దర్యాఫ్తు ముమ్మరం
రాజయ్య కోడలు సారిక, మనవళ్ల మృతి కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ప్రమాద ఘటన జరిగిన రాజయ్య నివాసానికి ఫోరెన్సిక్, పోలీసులు, పోస్టుమార్టం చేసిన డాక్టర్ల బృందం వచ్చింది. వారు ప్రమాద ఘటన ప్రాంతాన్ని, గదిని క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.
ఇదిలా ఉండగా, రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లలు సజీవ దహనమైన కేసులో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. అత్తింటి వేధింపులపై సారిక చనిపోవడానికి ముందే తన న్యాయవాది రెహానాకు ఓ మెయిల్ పంపిందన్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ మెయిల్ కలకలం రేపుతోంది. అత్తను సూర్యకాంతంతో పోల్చిన సారిక తన మామ సిరిసిల్ల రాజయ్యపై తీవ్ర ఆరోపణలు చేసింది. అన్నం కూడా పెట్టకుండా అత్త మాధవి వేధిస్తే, తండ్రి లాంటి మామ ఎంతమాత్రమూ జాలి చూపలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
జాలి చూపకపోగా, కర్కశంగా మాట్లాడి భిక్షం ఎత్తుకోవాల్సిందేనని బెదిరించారని వాపోయింది. నువ్వు నీ జీవితాన్ని త్యాగం చేయాలని, చాలామంది కోడళ్లు తమ అత్తమామలు, భర్త కోసం త్యాగం చేశారని, నువ్వు ఏం చేసినా చెల్లదని, తాను అధికారంలో ఉన్నానని, నువ్వు భిక్షం ఎత్తుకొని బతకాల్సిందేనని రాజయ్య తనను బెదిరించారని సారిక ఆ మెయిల్లో పేర్కొందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications