తెలంగాణలో మండిపోతున్న ఎండలు: ఆ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు
హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అప్పుడే రికార్డు స్థాయిలో ఉంటున్నాయి. హైదరాబాద్ తోపాటు ఇతర జిల్లాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం బయటికి రావాలంటేనే జనం జంకుతున్నారు. పలు చోట్ల వడగాలులు కూడా వీస్తున్నాయి. కాగా, వేడి విపరీతంగా పెరుగుతున్న క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ(ఐఎండీ).
Recommended Video

వడదెబ్బల బారినపడే అవకాశం ఉందంటూ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో అత్యధికంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్లో 20 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.

కాగా, నిర్మల్ జిల్లా లింగాపూర్లో 42.4 డిగ్రీలుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, తానూర్ లో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని సిర్కొండలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది.
తెలంగాణలో ఉదయం 10 గంటలకే ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం 12 అయిందంటే చాలు వేడి మరింత పెరిగిపోతోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచే భానుడు ఉగ్రరూపం దాల్చుతుండడంతో అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు వెళ్లాలంటేనే బెంబేలెత్తుతున్నారు ప్రజలు. 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిలకడగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగడంతో రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింతగా ఉండే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications