అమిత్ షా గారికి స్వాగతం.. తెలంగాణా ప్రజలకు వీటికి సమాధానం చెప్పండన్న ఎమ్మెల్సీ కవిత
బిజెపి రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభను ఈరోజు తుక్కుగూడ లో నిర్వహిస్తుంది. ఈ క్రమంలో రాష్ట్రానికి రానున్న కేంద్ర మంత్రి అమిత్ షాకు టీఆర్ఎస్ మంత్రులు, నేతలు అనేక ప్రశ్నలను సంధిస్తూ, వాటికి సమాధానం చెప్పిన తర్వాత రాష్ట్రంలో పర్యటించాలని సూచిస్తున్నారు.
అమిత్ షా కు స్వాగతం అంటూనే కవిత ప్రశ్నలు
ఇప్పటికే అమిత్ షా పర్యటన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తెలంగాణ పట్ల బిజెపికి ఎప్పటికీ అదే కక్ష, అదే వివక్ష అంటూ అనేక ప్రశ్నలు సంధించి బహిరంగ లేఖ రాస్తే, తాజాగా ఎమ్మెల్సీ కవిత కూడా హోంమంత్రి అమిత్ షాను టార్గెట్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న అమిత్ షా గారికి స్వాగతం అంటూ పేర్కొన్న ఎమ్మెల్సీ కవిత కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన, నిధులను బకాయిలను ఎప్పుడు క్లియర్ చేస్తుందో దయచేసి తెలంగాణ ప్రజలకు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్ల బకాయిలు : రూ. 3000 కోట్లకు పైగా ఉన్నాయని, బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్: రూ. 1350 కోట్లు, జీఎస్టీ పరిహారం: రూ. 2247 కోట్లు ఉందని ఆమె గుర్తు చేశారు.
తెలంగాణా ప్రజలను కలిసినప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్న కవిత
ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బణం, దేశంలో రికార్డులు సృష్టిస్తున్న నిరుద్యోగం, బిజెపి ఆధ్వర్యంలో కొనసాగుతున్న గరిష్ట మతపరమైన అల్లర్లు మొదలైన వాటికి అమిత్ షా గారు సమాధానం చెప్పాలని కవిత ప్రశ్నించారు. ఇక ఇదే సమయంలో బిజెపి ప్రభుత్వ స్వంత డేటా ప్రకారం భారత్ను అత్యంత ఖరీదైన ఇంధనం మరియు ఎల్పిజి ని విక్రయించడంలో అగ్రగామి దేశంగా మార్చామని చెబుతున్నారని కవిత టార్గెట్ చేశారు. అమిత్ షా జీ, ఈ రోజు మీరు అద్భుతమైన తెలంగాణ ప్రజలను కలిసినప్పుడు గత 8 సంవత్సరాలలో తెలంగాణకు ఒక్క ఐఐటీ, ఐఐఎం, ఐసర్, త్రిబుల్ ఐటీ, ఎన్ ఐ డి, మెడికల్ కాలేజీ లేదా నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందో చెప్పండి? అంటూ ప్రశ్నించారు
ఇది కేంద్ర ప్రభుత్వ కపటత్వం కాదా? ప్రశ్నించిన కవిత
హర్ ఘర్ జల్ యొక్క ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ పథకానికి స్ఫూర్తినిచ్చిన మిషన్ కాకతీయ మరియు మిషన్ భగీరథకు ₹ 24,000 కోట్ల నిధులను అందించాలని నీతి ఆయోగ్ చేసిన సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో చెప్పాలన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ కపటత్వం కాదా? అని ప్రశ్నించారు కవిత. కర్నాటకలోని ఎగువ భద్ర ప్రాజెక్ట్, కెన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్ట్ హోదాను కల్పించారని , పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మరియు తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదాను తిరస్కరించారని, అది ఎందుకో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.