ఆంధ్రా నేతలకు తెలంగాణలో ఏం పని? వారికి గంగుల కమలాకర్ సీరియస్ వార్నింగ్!!
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సమయంలో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యర్థి పార్టీలను ఉద్దేశించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తాజాగా బిజెపి నేత హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తాను సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని, గజ్వేల్ నుండి ఎన్నికల బరిలోకి దిగుతానని చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
ఈటల రాజేందర్ దమ్ము ధైర్యం ఉంటే ఒకే చోట నుంచి పోటీ చేయాలని, ఓటమి భయంతోనే ఈటల రెండు చోట్ల నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. దమ్ముంటే గజ్వేల్ లో ఒకే చోట పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. నేడు బి ఆర్ ఎస్ యువ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి, ఈటల రాజేందర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇక ఇదే సమయంలో కాంగ్రెస్, బిజెపిల పై మండిపడిన ఆయన, కాంగ్రెస్ బిజెపి బి ఫారాలు అమ్ముకుంటున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్, బిజెపి బి ఫారాలు ఢిల్లీలో ఒకటే చోట సిద్ధమవుతాయి అని, ఆ రెండు పార్టీలు కలిసే ఉంటాయని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. ఆ రెండు పార్టీలను ఎవరు నమ్మొద్దని ఆయన సూచించారు.
బిజెపికి తెలంగాణ రాష్ట్రంలో గుండు సున్నా వస్తుందని పేర్కొన్న ఆయన, ఇదే భయంతో ఈటల రాజేందర్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారని విమర్శించారు. మతతత్వ పార్టీ అయిన బిజెపికి, భూకబ్జాలు చేసే పార్టీ అయినా కాంగ్రెస్ కు అధికారం ఇవ్వద్దని ఆయన కోరారు. ఇక ఇదే సమయంలో ఆంధ్ర నేతలపై మంత్రి గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణను తిరిగి ఆంధ్రాలో కలపాలని కొందరు చూస్తున్నారని గంగుల కమలాకర్ విమర్శించారు. వైయస్ షర్మిల, కే ఏ పాల్, కెవిపి రామచంద్రరావు, కిరణ్ కుమార్ రెడ్డిలకు తెలంగాణ రాష్ట్రంలో ఏం పని అంటూ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. వారిని అసలే నమ్మొద్దని, వారు తెలంగాణను ఆంధ్రాలో కలపాలని చూస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. బండి సంజయ్ చేసే ఆరోపణలను పట్టించుకోమని గంగుల కమలాకర్ తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications