రాములమ్మ ఎక్కడ, సొంతవాళ్లే అడ్డుకుంటున్నారా, ఎందుకు?: ఆలస్యంపై విజయశాంతి అసహనం
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ఇటీవల ఎన్నికల ప్రచారంలో కనిపించడం లేదు. దీనిపై వివిధ రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాములమ్మ మూడు నాలుగు రోజులు మాత్రమే ప్రచారం చేశారని, ఆ తర్వాత ఎందుకు కనిపించడం లేదనే చర్చ అటు కాంగ్రెస్తో పాటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా ప్రచారకర్త. ఆయన ప్రచారంలో పాల్గొంటున్నారు. కానీ రాములమ్మగా పేరుగాంచిన విజయశాంతి ఇటీవల ఎక్కడా కనిపించక పోవడం గమనార్హం. ఆమె క్రేజ్ చూసి కొందరు నేతలే అడ్డుకుంటున్నారని కొందరు.. కాదు కాదు, అభ్యర్థులు తేలకుంటే ప్రచారం ఎలా చేస్తారని మరికొందరి వాదనగా ఉంది. ఏది ఏమైనా ప్రచారంలో ఆమె లేని లోటు కనిపిస్తోందంటున్నారు.

విజయశాంతిని వారే అడ్డుకున్నారా?
ప్రచారం ప్రారంభంలో ఆమె కొద్ది రోజులే ప్రచారం చేశారు. కానీ కేసీఆర్ పైన ఆమె చేసిన వ్యాఖ్యలకు ప్రజల నుంచి అనూహ్యమైన మద్దతు కనిపించింది. పైగా ఆమెకు నటిగా, రాములమ్మగా ఓ గుర్తింపు ఉంది. ప్రజల్లో ఆమెకు ఆదరణ ఉంది. వీటికి తోడు ప్రచారంలో కేసీఆర్ పైన ఆమె దూకుడు అందర్నీ ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా పార్టీ అభ్యర్థుల జాబితాను కొందరు నేతలు అడ్డుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. ఆ నేతలే రాములమ్మకు వస్తున్న ఆదరణ, మైలేజీని చూసి, భయంతో అడ్డుపడుతుండవచ్చుననే వాదనలు కూడా ఉన్నాయి.

విజయశాంతి దూకుడు, అనేక మంది నుంచి విజ్ఞప్తులు
ప్రచారంలో భాగంగా ఆమె మూడ్రోజుల పాటు మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని తొమ్మిది నియోజకర్గాల్లో జోరుగా ప్రచారం చేశారు. ఆమె ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. కేవలం పాలమూరులోనే కాదు రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ఆమెకు ప్రత్యేక గుర్తింపు, ఫాలోయింగ్ ఉంటుంది. ఈ భయంతో కాంగ్రెస్లోని కొందరు నేతలు ఆమెను అడ్డుకునే ప్రయత్నాలు చేసి ఉంటారా అనే చర్చ సాగుతోంది. విజయశాంతి ప్రచారానికి వచ్చిన ఆదరణ చూసి చాలామంది కాంగ్రెస్ పార్టీ ఆశావహులు తమ తమ నియోజకవర్గాలకు ఆమెను ప్రచారానికి తీసుకెళ్లాలని భావించారు. దాదాపు 45 నుంచి 50 నియోజకవర్గాల నుంచి ఆమెకు విజ్ఞప్తులు వచ్చాయని తెలుస్తోంది.

వారి వల్ల బ్రేక్ పడిందా?
కానీ అనూహ్యంగా విజయశాంతి ప్రచారానికి బ్రేక్ పడింది. విరామాలు మినహాయించు అక్టోబర్ 10వ తేదీ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు చెప్పారు. కానీ మూడు నాలుగు రోజుల్లోనే ముగిసిన ప్రచారం.. ఇప్పటికీ తిరిగి ప్రారంభం కాలేదు. ఆమెకు వస్తున్న ఆదరణతో కొందరు సీనియర్లు ఇబ్బంది పడ్డారా, ప్రచారానికి బ్రేక్ పడటానికి అదే కారణమా అనే చర్చ అంతర్గతంగాను నడుస్తోందట.

అభ్యర్థే తేలకుంటే ప్రచారం ఎలా?
మరోవైపు, ఆయా నియోజకవర్గాల్లో అధికారికంగా అభ్యర్థులు ఎవరో ఖరారు కాకుండా ప్రచారం సరికాదని భావించి ప్రచార కమిటీ విరామం నిర్ణయం తీసుకుందని చెబుతున్నారట. విజయశాంతి వంటి కీలక నేత ప్రచారంలో పక్కన అభ్యర్థి కూడా ఉంటే జనంలోకి సులభంగా వెళ్తుందని, అభ్యర్థి తేలకుండా ప్రచారం ఎలాగని చేస్తారని, అందుకే విరామం అనే వాదనలు వినిపిస్తున్నాయి. అభ్యర్థులు తేలాక విజయశాంతి రంగంలోకి దిగుతారని అంటున్నారు.

ఆలస్యం.... రాములమ్మ అసహనం
కాగా, అభ్యర్థులు తేలకపోవడం, ప్రచారానికి నెలకు పైగా విరామం.. ఇవన్నీ రాములమ్మకు కూడా అసహనం తెప్పిస్తున్నాయని తెలుస్తోంది. టీఆర్ఎస్ అగ్రనేతలు ప్రచారం చేస్తూ విపక్షాలు, కూటమిపై విమర్శలు గుప్పిస్తుంటే, కాంగ్రెస్ అంతేస్థాయిలో కౌంటర్ ఇవ్వాల్సి ఉందని, కానీ ఇప్పటి వరకు అభ్యర్థులు తేలకపోవడం, కీలక ప్రచారం కాకపోవడంపై ఆమె అసంతృప్తితో ఉన్నారట. విజయశాంతి స్టార్ క్యాంపెయినర్ అని, మళ్లీ ప్రచారం ప్రారంభిస్తారని ఆమె కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications