కేసీఆర్-కోదండరామ్ లకు చెడింది అక్కడే..! : ఆ పర్యటన తర్వాతే..!
హైదరాబాద్ : తెలంగాణలో అప్రతిహతంగా దూసుకుపోతున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రొఫెసర్ కోదండరామ్ తిరగబడ్డం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉద్యమ సమయంలో సమన్వయంతో పనిచేసిన కేసీఆర్-కోదండరామ్ నడుమ తెలంగాణ వచ్చాక మాత్రం ఎందుకు గ్యాప్ ఏర్పడిందనేది చాలామందిని ఆలోచింపజేస్తున్న విషయం.
ఇందుకు కారణాలు తెలియాలంటే.. ఒక్కసారి గతంలోకి తొంగి చూడాల్సిందే. 2009లో కేసీఆర్ చేసిన ఆమరణ దీక్ష మూలంగా కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆంధ్రా ప్రాంత నేతల నుంచి వచ్చిన ఒత్తిడితో ఏర్పాటు ప్రక్రియ కాస్త తీవ్ర జాప్యానికి గురవుతూ వచ్చింది. చిదంబరం చేసిన ప్రకటన తర్వాత కేంద్రం నుంచి మళ్లీ ఎటువంటి స్పష్టమైన హామి రాలేదు.
దీంతో అంతర్మథనంలో పడ్డ కేసీఆర్.. పార్టీలకు అతీతంగా జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని భావించారు. ఆ నేపథ్యంలోనే కేసీఆర్, కాంగ్రెస్ నేత జానారెడ్డి ఇంటికి వెళ్లడం.. కేసీఆర్ సూచన మేరకే కోదండరామ్ ని జేఏసీ అధ్యక్షుడిగా నియమించడం జరిగిపోయాయి.
కేసీఆర్ ఆశించినట్టుగానే జేఏసీ పనితీరును ఉద్యమ ఆశయాలకు అనుగుణంగా నడిపించడంలో సఫలమయ్యారు కోదండరామ్. దీంతో ఇద్దరు కలిసి సమన్యయంతో ఉద్యమాన్ని క్షేత్ర స్థాయిలో ఉధృతం చేశారు. అయితే ఉద్యమాన్ని ఎంత ఉధృతంగా నడిపినా..! కేంద్రం తాత్సారం చేస్తూ రావడంతో, అసంతృప్తికి లోనైన కేసీఆర్, ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లను సాధించడం ద్వారా ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసుకోవచ్చునని భావించినట్టుగా చెబుతారు.
అయితే, ఇదే సమయంలో కాంగ్రెస్ కేసీఆర్ ని కాకుండా కోదండరామ్ ని ఢిల్లీకి పిలిపించుకుని సంప్రదింపులు జరపడం.. ఇద్దరి మధ్య విబేధాలకు బీజం వేసిందనేది పలువురి అభిప్రాయం. ఇకపోతే కోదండరామ్ తో చర్చలు జరిపిన కాంగ్రెస్, అప్పటి ఎన్నికల్లో జేఏసీ కాంగ్రెస్ కి మద్దతు పలకాలనే నిబంధన మీద తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి అంగీకరించిందనే వాదన ఉంది.
దీంతో ఎన్నికల్లో ఎలాగు టీఆర్ఎస్ కాంగ్రెస్ జతగానే బరిలోకి దిగుతాయని భావించిన కోదండరామ్, కాంగ్రెస్ పెట్టిన షరతుకు ఒప్పుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రెండు పార్టీలు వేర్వేరుగా బరిలోకి దిగడం, ఎవరికి మద్దుతునివ్వలేక కోదండరామ్ తటస్థంగా ఉండిపోవడంతో.. కేసీఆర్ అసంతృప్తికి లోనయ్యారనే చర్చ జరిగింది. ఆ తర్వాత కాలంలో జేఏసీ నాయకులు కొంతమంది కేసీఆర్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తే.. కోదండరామ్ మాత్రం దూరంగానే ఉండిపోయారు.
దీంతో కేసీఆర్ కోదండరామ్ నడుమ అప్పడు ఏర్పడిన గ్యాప్ ఇంకా కొనసాగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఆ పర్యటన తర్వాతే :
ఇక ప్రొఫెసర్ కోదండరామ్ చేసిన తాజా వ్యాఖ్యల వెనుక మరో కోణం కూడా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. జేఏసీ ని టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తయారుచేయాలని కోదండరామ్ పై ఒత్తిడి రావడంతో ఆ దిశగా ఆయనేమైనా ప్రయత్నాలు చేస్తున్నారా..! అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు పలువురు.
తాను చేసిన తాజా వ్యాఖ్యలకు కొద్ది రోజుల ముందు కోదండరామ్ విదేశాల్లో పర్యటించారు. అక్కడ పర్యటిస్తున్న సందర్భంలో చాలామంది జేఏసీని ఓ రాజకీయ శక్తిగా మార్చాలనే అభిప్రాయాన్ని కోదండరామ్ తో వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రొఫెసర్ కోదండరామ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కి ఓ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీని రూపొందించాలని వారంతా కోరినట్టుగా సమాచారం.
ఇక విదేశీ పర్యటనలను ముగించుకుని వచ్చిన వెంటనే కోదండరామ్ మీడియా సమావేశంపెట్టడం, ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం వంటివి కూడా ఆ ప్రయత్నాల్లో భాగమే అనేవారు కూడా లేకపోలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై జేఏసీ హోదాలోనే పోరాడుతారా..! లేక రాజకీయ శక్తిగా దాన్ని రూపాంతరం చెందిస్తారా..! అన్న ప్రశ్నలకు కోదండరామ్ భవిష్యత్ వ్యూహాలే సమాధానంగా మారనున్నాయి.