'ఎమ్మెల్సీ' పదవులు-కేసీఆర్ లెక్కేంటి-కొత్త ముఖాలకే అవకాశమా-సీనియర్ల సంగతేంటి?
తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావహులు పోటీ పడుతున్నారు. ఈ నెల 16న ఖాళీ అవనున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవి కోసం కూడా చాలామందే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆశావహులంతా ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తవారికే అవకాశం కల్పించాలన్న యోచనలో అధినేత ఉన్నట్లు లీకులు వస్తుండటంతో.. ఇప్పటివరకూ ఎలాంటి పదవులు చేపట్టనివారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ లెక్కేంటి...?
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో సీఎం కేసీఆర్ పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉద్యమ కాలంలో పార్టీ కోసం పనిచేసినవారు,యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నవారికి అవకాశం కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే పలువురి పేర్లతో ఒక జాబితాను సిద్దం చేసినట్లు సమాచారం. ఇందులో కేసీఆర్ ఓకె చేసే అభ్యర్థులకు పదవులు దక్కనున్నాయి.
కొత్తవారికే అవకాశమా...?
సీనియర్ల కంటే కొత్తవారికి పదవులు ఇస్తే... పార్టీ కోసం,ప్రభుత్వం కోసం మరింత శ్రమిస్తారని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పదవులు అనుభవించినవారికి కాకుండా కొత్త ముఖాలకే అవకాశం ఇచ్చే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కొత్త,పాత కలయికతో ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉందన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. పాతవారిలో కొంతమందికి మళ్లీ అవకాశం ఇచ్చి... మిగతా స్థానాలకు కొత్తవారిని ఎంపిక చేయవచ్చునని తెలుస్తోంది. పదవుల కోసం ఒక్కో జిల్లా నుంచి నలుగురైదుగురు నేతలు పదవుల కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం.
గుత్తా,కడియంల సంగతేంటి...?
ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తయినవారిలో గుత్తా సుఖేందర్ రెడ్డి,నేతి విద్యాసాగర్,బోడకుంటి వెంకటేశ్వర్లు,కడియం శ్రీహరి,ఫరీదుద్దీన్,ఆకుల లలిత ఉన్నారు. ఈ నెల 16న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పదవి కాలం కూడా ముగియనుంది. ఈ ఏడుగురిలో చాలామంది రెన్యువల్ ఆశిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ నేతలు కడియం శ్రీహరి,గుత్తా సుఖేందర్ రెడ్డిలకు కేసీఆర్ మళ్లీ అవకాశం ఇస్తారా ఇవ్వరా అన్న చర్చ జరుగుతోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్సీ ఆశిస్తున్నవారిలో కడియంతో పాటు మాజీ స్పీకర్ మధుసూదనాచారి,తక్కెళ్లపల్లి రవీందర్ రావు,మాజీ మంత్రి చందులాల్ తనయుడు ప్రహ్లాద్,గుడిమల్ల రవి కుమార్ తదితరులు ఉన్నారు. అయితే ఏవిధంగా చూసుకున్నా వీరందరి కంటే కడియం చాలా సీనియర్ నేత. ఈ నేపథ్యంలో కడియంకు మళ్లీ అవకాశం దక్కుతుందా... లేక కొత్తవారికి సీఎం అవకాశం ఇస్తారా... జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎవరి పేరును సిఫారసు చేస్తారన్నది చర్చనీయాంశమైంది.
Recommended Video
అన్ని జిల్లాల నుంచి ఆశావహుల ప్రయత్నాలు
నల్గొండ జిల్లాకు చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డికి మళ్లీ అవకాశం దక్కుతుందా దక్కదా అన్నది జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. రెండు నెలల క్రితం సాగర్ ఉపఎన్నిక సందర్భంగా ఎంసీ కోటిరెడ్డికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేశారు. జిల్లా నుంచి వేముల వీరేశంతో పాటు వేమిరెడ్డి నర్సింహారెడ్డి,కర్నె ప్రభాకర్ తదితర నేతలు కూడా పదవి ఆశిస్తున్నారు. ఒకవేళ కొత్తవారికే అవకాశం ఇచ్చే పక్షంలో ఎంసీ కోటిరెడ్డికే పదవి దక్కవచ్చునని తెలుస్తోంది. అటు కరీంనగర్ నుంచి... ఒకవేళ టీటీడీపీ అధ్యక్షుడు రమణ టీఆర్ఎస్లో చేరితే ఆయనకు పదవి ఇవ్వొచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మిగతా జిల్లాల్లోనూ సీనియర్లతో పాటు ఇప్పటివరకూ పదవులు దక్కనివారు ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు.