'అన్నింట్లో ఏపీతో పోల్చుకుంటున్న కెసిఆర్, ఇందులో వెనక్కెందుకో'
హైదరాబాద్: అన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోల్చుకునే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కార్మికుల జీతాల విషయంలో మాత్రం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడులా ఎందుకు వ్యవహరించలేకపోతున్నారని వామపక్ష నేత తమ్మినేని వీరభద్రం అభిప్రాయపడ్డారు.
మున్సిపల్ కార్మికుల సమ్మె పైన తమ్మినేని ఆదివారం నాడు మాట్లాడారు. అన్ని విషయాల్లో ఏపీతో పోల్చుకునే కెసిఆర్, అక్కడ కార్మికుల జీతాలు పెంచితే ఇక్కడెందుకు అలా చేయలేదని ప్రశ్నించారు. మున్సిపల్ కార్మికుల డిమాండ్ల పైన తగ్గకుంటే తాము 28, 29, 30 తేదీల్లో ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.
సమ్మె పైన ప్రభుత్వం మొండి వైఖరి సరికాదన్నారు. ఉస్మానియా ఆసుపత్రి విషయమై విస్తృత స్థాయి చర్చ జరగాలన్నారు. వామపక్షాల నేతలం ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి పరిశీలిస్తామని చెప్పారు. ప్రాజెక్టుల డిజైన్ల మార్పు ద్వారా అక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు.
పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్పులను పరిశీలిస్తామన్నారు. రీడిజైన్ పైన వామపక్షాల నేతలో ఇంజినీర్లతో సమావేశం నిర్వహిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టును త్వరలో ఏర్పాటు చేయాలన్నారు. వరంగల్ లోకసభ ఉప ఎన్నికల్లో వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిలుపుతామని చెప్పారు.