ముందస్తుపై నాలుగైదు రోజుల్లో స్పష్టత: కేటీఆర్, కేసీఆర్ నిర్ణయం అదే!
హైదరాబాద్: కొంగరకలాన్లో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముందస్తు ఎన్నికలు అంటే విపక్షాలకు అంత భయం ఎందుకని ప్రశ్నించారు. మేం అధికారాన్ని త్యాగం చేసి ఎన్నికలకు వెళ్తే విపక్షాలు ఎందుకు భయపడుతున్నాయో చెప్పాలన్నారు.
Recommended Video
ముందస్తుపై నాలుగైదు రోజుల్లో స్పష్టత వస్తుందని తేల్చి చెప్పారు. అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందామని చెప్పారు. అయినా ఎన్నికలు అంటే భయం ఎందుకన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెరాసకు 100 సీట్లు ఖాయమన్నారు. తాము విపక్షాలకు జవాబుదారి కాదని, ప్రజలే తమకు బాస్లు అని చెప్పారు. మేం ప్రజల మనసును దోచుకుంటామని, కాంగ్రెస్ పార్టీ నేతల్లా ప్రజలను దోచుకోమని చెప్పారు.
సెప్టెంబర్ 2వ తేదీన అపురూప వేదికను చూడబోతున్నారని చెప్పారు. 2వేల ఎకరాల్లో సభ ఉంటుందని, 500 ఎకరాల సభా ప్రాంగణం అన్నారు. 200, 100 ఫీట్ల రోడ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 200కు పైగా యంత్రాంగాలు పని చేస్తున్నాయని చెప్పారు. ప్రగతి నివేదన సభకు పార్టీ నిధులనే ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా 8 కమిటీలు వేశామని చెప్పారు. హైదరాబాద్ నుంచి 8 లక్షల మంది తరలి వస్తున్నారని చెప్పారు.
ముందస్తుకు పోవాలని తమ పార్టీ ఆలోచన: నాయిని
ముందస్తుకు పోవాలన్నది తమ పార్టీ ఆలోచన అని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ తేదీ ప్రకటిస్తే అప్పుడే ఎన్నికలు అన్నారు. ఎన్నికల నిర్వహణ బాధ్యతను కేసీఆర్కు అప్పగించామని చెప్పారు. పార్టీ కార్యకర్తలే తమకు శ్రీరామరక్ష అన్నారు. కంటి వెలుగులో కాంగ్రెస్ నేతలకు పరీక్షలు చేయించాలన్నారు. కోదండరాం తెగిన గాలిపటం అన్నారు.
ముందస్తు ఎందుకో చెప్పాలి: జీవన్ రెడ్డి
కేసీఆర్ పాలనలో నిరుద్యోగులకు నిరాశనే మిగిలిందని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అన్నారు. నాలుగున్నరేళ్లయినా ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదన్నారు. కొత్త జిల్లాల ఆమోదం కోసమే తెరపైకి జోనల్ విధానం అన్నారు. మోడీకి అమిత్ షా కంటే కేసీఆర్ అత్యంత సన్నిహితుడు అన్నారు. బైసన్ పోలో మైదానంలో సచివాలయం ఏర్పాటు సరికాదన్నారు. కేసీఆర్ సాధించిన ప్రగతి ఈ నాలుగేళ్లలో కేవలం ప్రగతి భవన్ మాత్రమే అన్నారు. ప్రజలు అయిదేళ్లు అధికారం ఇస్తే ముందస్తుకు ఎందుకు వెళ్తున్నారో ప్రజలు చెప్పాలన్నారు.
కాగా, కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలోను కేంద్రమంత్రుల చర్చలో ఈ అంశం ప్రస్తావిస్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.