చంద్రబాబు హామీ, కృష్ణయ్య ఎందుకు రాలేదు?
హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల పైన తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, డాక్టర్ కే లక్ష్మణ్, ఎల్ రమణ, రావుల చంద్రశేఖర రావులతో శనివారంనాడు లేక్ వ్యూ అతిథి గృహంలో ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో చర్చించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించే వ్యూహంపై చర్చించారు. మాధవరం కృష్ణారావు వెళ్లిపోయినా ఫర్వాలేదని, కొందరు తెరాస ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటేస్తామని చెప్పారని బాబుతో ఎర్రబెల్లి చెప్పారు. అదే సమయంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య మహానాడుకు హాజరుకాకపోవడంపై చర్చించారు.
బ్యాలెట్ పేపర్పై అభ్యర్థుల ఫొటోలే
శాసన మండలికి ఎమ్మెల్యేల కోటాలో జరగనున్న ఎన్నికల్లో బ్యాలెట్పై అభ్యర్థుల పాస్ పోర్టు సైజు (బ్లాక్ అండ్ వైట్) ఫొటోలు ఉండబోతున్నాయి. ఫొటోలు పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నిర్ణయం తీసుకున్న తర్వాత జరగబోతున్న మొదటి ఎన్నికలు.
అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాలు నెంబర్-1లో జూన్ 1వ తేదీన పోలింగ్ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ఓటింగ్ విధానం, కౌంటింగ్ ఎలా నిర్వహిస్తారన్న తదితర అంశాలపై అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్లాల్ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పదవీ విరమణ చేసిన సీఆర్ బ్రహ్మంను అసెంబ్లీకి పంపించారు.

ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ రాజాసదారాం అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాలులో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు టీడీపీ అభ్యర్థి తప్ప మిగతా పార్టీల అభ్యర్థులు హాజరయ్యారు.
వారు వ్యక్తం చేసిన అనుమానాలను, సందేహాలను బ్రహ్మం, రాజా సదారాం నివృత్తి చేశారు. ఓటు విలువ, ఎలిమినేషన్ విధానం, ఏ పొరపాట్లు చేస్తే ఓట్లు చెల్లవో మొదలైన అంశాల గురించి వివరించారు.
ఓటు వేసే కంపార్ట్మెంట్లో ఎన్నికల సంఘం ఇచ్చిన నీలి రంగు పెన్నుతోనే ఓటు వేయాలని, అభ్యర్థుల పక్కన టిక్కులు పెట్టకుండా, ప్రాధాన్యత ఓటింగ్లో అంకెలు మాత్రమే వేయాలని, బ్యాలెట్పై ఏమీ రాయకూడదని, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారు వివరించారు.
ఎవరికీ ఓటు వేయదలచుకోనప్పుడు (నోటా)కు అవకాశం ఉందని వారు చెప్పారు. తాము చేసిన సూచనలను ఓటర్లకు తెలియజేసుకోవాలని వారు సూచించారు.
పోలింగ్ మధ్యాహ్నం లోపే ముగిసినా 4 గంటల వరకు పోలింగ్ గడువు ముగిసేంత వరకూ కూర్చోవాల్సిందేనని, గంట విరామం తర్వాత అంటే 5 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. పోలింగ్ సమయంలోగానీ, కౌంటింగ్ సమయంలోగానీ ఎవరికీ ఎటువంటి అనుమానాలు, సందేహాలు లేకుండా ఉండేందుకు వెబ్-కాస్ట్ చేయనున్నట్లు వారు తెలిపారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మీడియాను లోపల అనుమతించడం లేదని రిటర్నింగ్ అధికారి డాక్టర్ సదారాం చెప్పారు. వెబ్-కాస్ట్ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా వెబ్లో ప్రక్రియను చూసుకోవడానికి అవకాశం ఉందన్నారు.












Click it and Unblock the Notifications