తెలంగాణలో వైఎస్ షర్మిల పరామర్శ: ఎందుకు, జోష్ తగ్గిందా?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిల తెరిపి లేకుండా తెలంగాణలో పరామర్శ యాత్ర చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాతో మొదలు పెట్టిన ఆమె యాత్ర ప్రస్తుతం వరంగల్ జిల్లాలో సాగుతోంది. అయితే, గతంలో ఆమె యాత్రలకు, బహిరంగ సభలకు ఉన్నంత ప్రజాదరణ ప్రస్తుత పరామర్శ యాత్రకు కనిపించడం లేదు. మొత్తంగానే, వైయస్సార్ కాంగ్రెసు తెలంగాణలో బలహీనపడింది.
తెలంగాణలో నామమాత్రంగా ఉన్న పార్టీ వైయస్ షర్మల యాత్ర వల్ల పుంజుకుంటుందా అనేది కూడా అనుమానంగానే ఉంది. అయితే, ఆమె యాత్ర ఉద్దేశం గానీ, అందుకు సంబంధించిన వ్యూహం గానీ ఏమిటనేది ప్రశ్నార్థకంగానే ఉంది. ఒక రకంగా తీవ్రంగా దెబ్బలు తిన్న తెలుగుదేశం పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కన్నా బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

షర్మిల యాత్ర
ఇంతకు ముందు షర్మిల యాత్ర అంటే ఇటు మీడియాలోనూ అటు ప్రజల్లోనూ ఒక రకమైన ఆసక్తి ఉండేది. అంతటి ఆసక్తి ఇప్పుడు కనిపించడం లేదు.

షర్మిల యాత్ర
వైయస్ జగన్ సోదరి షర్మిల తెలంగాణలో పరామర్శ యాత్ర కొనసాగించడానికి గల కారణాలపై పలు రకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

షర్మిల యాత్ర
వైయస్ జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో కుమ్మక్కయ్యారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో పాటు ఎపి మంత్రులు, టిడిపి నాయకులు విమర్శిస్తున్నారు. ఇందులో నిజం ఉందా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

షర్మిల యాత్ర
వచ్చే ఎన్నికల నాటికి కాస్తా బలం పుంజుకుని తెలుగుదేశం పార్టీ ఓట్లను చీల్చే వ్యూహంలో భాగంగానే షర్మిల పరామర్శ యాత్ర సాగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

షర్మిల యాత్ర
షర్మిల పరామర్శ యాత్రకు మంచి స్పందన లభిస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణ నాయకులు అంటున్నారు.
అయితే, వ్యూహాత్మకంగానే ఆమె పరామర్శ యాత్రను కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు. నిజానికి, తెలంగాణలో పార్టీకి పునరజ్జీవం పోయాలనే ఆలోచన నుంచి వైయస్ జగన్ మొదట్లో ఉన్నారని అంటున్నారు. కానీ, పరిస్థితుల కారణంగా ఆయన పార్టీని కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెసు, తెలుగుదేశం, వామపక్షాలు పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణలో పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును, తెలంగాణ రాష్ట్ర సమితిని బలహీనపరచడానికి ప్రతిపక్షాలన్నీ ఏకమైనా అశ్చర్యం లేని వాతావరణం ఉంది. ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీ ఓట్లను ఏ మేరకైనా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చీల్చగలిగితే టిఆర్ఎస్కు ఉపయోగపడే అవకాశం ఉంది. అందుకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణలో కొనసాగించాలని వైయస్ జగన్ భావిస్తున్నారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.












Click it and Unblock the Notifications