ఒంటరితనం, ప్రియుడిపై వ్యామోహం: స్వాతి భర్తను చంపడానికి కారణాలివే!
Recommended Video
హైదరాబాద్/నాగర్ కర్నూలు: ప్రియుడి కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే హత్య చేసిన స్వాతి ఉదంతం కలకలం రేపుతోంది. భర్త వ్యాపార పనుల్లో పడి తనను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తితో అడ్డదారి తొక్కింది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని, భర్తను చంపి, ఇప్పుడు కటకటాలు లెక్కిస్తోంది.
ప్రియుడితో రాసలీలు: భర్తకు ట్విస్టిచ్చిన స్వాతి, మత్తిచ్చి, ఎవడు సినిమాలో...
తరచూ వ్యాపార పనుల నిమిత్తం తన భర్త బయటకు వెళ్తుంటే ఇంట్లో ఒంటరిగా ఉండేది. ఒంటరితనం, తనకు దగ్గరైన కుర్ర డాక్టర్పై (ప్రియుడు) వ్యామోహం కలిసి ఆమెను హంతకురాలిగా మార్చాయి. యాసిడ్ దాడి కేసు విచారణలో భాగంగా ఇప్పటికే స్వాతి, ఆమె ప్రియుడు రాజేష్ల నుంచి పోలీసులు నిజాన్ని రాబట్టారు.
పోలీసులు ఏం చెప్పారంటే
ఇంట్లో ఒంటరిగా ఉండే స్వాతికి రాజేష్ దగ్గర కాగా, ఆ విషయం భర్త సుధాకర్ రెడ్డికి తెలిసి, వారిద్దరి మధ్యా గొడవ జరిగిందని, ఈ గొడవలో సుధాకర్ తలకు గాయమైందని, ఆయన ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడని పోలీసులు తెలిపారు. ఆ సమయంలోనే స్వాతి, ఆమె ప్రియుడు కలిసి సుధాకర్ను చంపాలని ప్లాన్ వేశారని తెలిపారు.
ఇనుప రాడ్డుతో కొట్టారు
నిద్రిస్తున్న సుధాకర్ మెడకు మత్తు ఇంజక్షన్ను ఇచ్చిన రాజేష్, తలపై ఇనుప రాడ్డుతో కొట్టి చంపారని, ఆ తర్వాత శవాన్ని తీసుకెళ్లి దహనం చేసి, యాసిడ్ దాడి నాటకం మొదలు పెట్టారని తెలిపారు. ఓ సీరియల్లో చూపించిన విధంగా ప్లాస్టిక్ సర్జరీతో తన భర్త రూపురేఖలు మార్చాలన్న ఆలోచన స్వాతిని ఈ పని చేసేందుకు ప్రోత్సహించిందన్నారు.
వారం రోజుల పాటు సాగిన నాటకం
తన ముఖానికి పెద్దగా గాయాలు కారాదని, నల్లగా మారితే ఇక ఎవరూ గుర్తు పట్టరని భావించిన రాజేష్, ఓ టవల్ను ముఖంపై చుట్టుకుని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని యాసిడ్ దాడి నాటకం ఆడారని పోలీసులు తెలిపారు. ఈ నాటకం వారం రోజుల పాటు సాగిందని, ముఖానికి గాయాలు మానాయని చెబుతూ ముఖంపై ఉన్న కట్టు తీసిన తర్వాతే అతను సుధాకర్ కాదని బంధువులకు తెలిసిందని, ఆపైనే మొత్తం విషయం వెలుగు చూసిందని తెలిపారు.
రెండేళ్ల క్రితం పరిచయం
నాగర్కర్నూలులో ఫిజియో థెరఫీ కేంద్రం నిర్వహిస్తున్న రాజేష్తో స్వాతికి రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. సుధాకర్ రెడ్డి లేని సమయంలో రాజేష్ తరుచూ స్వాతి ఇంటికి వచ్చి కలుస్తుండేవాడు. మరోవైపు భర్త వ్యాపారంలో తలమునకలై ఉదయం వెళ్లి, రాత్రి తిరిగి రావడం, తనను ఎక్కువగా పట్టించుకోవడం లేదనే భావన స్వాతిలో కలిగింది. భర్తను చంపిన తర్వాత ప్రియుడినే తన భర్తగా స్వాతి అందరినీ నమ్మించింది.
రిమాండుకు తరలింపు
సుధాకర్ రెడ్డిని పరామర్శించేందుకు ఈ నెల 9న అతని అతని అన్న సురేందర్ రెడ్డి, తల్లి సుమతమ్మ ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స పొందుతున్నది సుధాకర్ రెడ్డి కాదని, గుర్తించి నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొల్లాపూర్ సీఐ శ్రీనివాస రావు బృందం హైదరాబాద్ వెళ్లి చికిత్స పొందుతున్న వ్యక్తి వేలిముద్రలు సేకరించారు. అతను సుధాకర్ రెడ్డి కాదని, రాజేష్ అని నిర్ధారణక వచ్చారు. వెంటనే స్వాతిని అదుపులోకి తీసుకొని విచారించారు. రాజేష్తో కలిసి భర్తను హతమార్చి మృతదేహాన్ని కాల్చినట్లు అంగీకరించింది. శనివారం పోలీసులు అక్కడకు వెళ్లి ఆధారాలు సేకరించారు. సుధాకర్ రెడ్డి హత్య కేసులో రాజేష్, స్వాతిలను నిందితులుగా చేర్చి కేసు నమోదు చేశారు. స్వాతి ఆదివారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండుకు తరలించారు. రాజేష్ను అదుపులోకి తీసుకొని విచారించనున్నారు.