పోలీసులు షాక్: యాచకురాలి వద్ద రూ.2లక్షల నగదు, ఏం చేశారంటే?
హైదరాబాద్: నగరాన్ని యాచకులు లేని నగరంగా మార్చే ప్రయత్నంలో భాగంగా వివిధ ప్రాంతాల్లోని యాచకులను వారి సమ్మతి మేరకు పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది జీహెచ్ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్). ఇందులో భాగంగా ముసారాంభాగ్ టీవీ వద్ద ఉన్న ఓ యాచకురాలిని జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసులు కలిసి చర్లపల్లి జైలు వద్ద ఉన్న పునరావాస కేంద్రానికి తరలించారు.
అయితే, ఆమె వద్ద ఉన్న సంచిలో రూ.2,34,320 నగదు ఉండటం చూసి వారంతా షాకయ్యారు. కాగా, భర్త చనిపోవడంతో పెంటమ్మ అనే ఈ మహిళ తన ఇద్దరు కొడుకులతో నల్గొండలోని మిర్యాలగూడలో ఉండేది. తనకు చెందిన 60యార్డ్ భూమిని అమ్మిన ఆమె.. వచ్చిన రూ.2లక్షల్లో ఒక లక్ష రూపాయలను ఆమె కుటుంబానికి ఇచ్చేసింది.
ఆ తర్వాత ఓ కొడుకు చనిపోవడం, మరో కొడుకు అదృశ్యమవడంతో పెంటమ్మ ఇంటి నుంచి బయటికి వచ్చింది. 2011లో హైదరాబాద్ వచ్చిన ఆమె.. ముసారాంభాగ్ టీవీ టవర్ వద్ద భిక్షమెత్తుకుంటూ జీవిస్తోంది. కాగా, పెంటమ్మ వద్ద ఉన్న డబ్బును గుర్తించిన పోలీసులు.. ఆమె పేరిట ఎస్బీఐ బ్యాంకు ఖాతా తెరిపించి అందులో ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయించారు.