హృదయ విదారకం: మృత్యుఒడిలోకి చేరుతూ బిడ్డను కాపాడిన తల్లి
వరంగల్: తల్లి ప్రేమకు అంతులేదని మరోసారి రుజువు చేసేంది ఓ మాతృమూర్తి. తన ప్రాణాలు పోతున్నాయని తెలిసి కూడా.. తన బిడ్డ బతకాలని కోరుకుంది. అంతే, తన ప్రాణాల గురించి ఏ మాత్రం ఆలోచింకుండా తన బిడ్డను కాపాడుకుంది. తన ప్రాణాలు వదులుకుంది. హృదయవిదారకరమైన ఈ ఘటన వరంగల్ రైల్వే స్టేషన్లో గురువారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. రాయపర్తి మండలం మైలారానికి చెందిన చిర్ర సంతోష్, రజని(25) దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్దకుమార్తె సంజన కాగా, మిగతా ఇద్దరూ కవలలు సాత్విక, సంజయ్లు. హైదరాబాద్లోని బంధువుల ఇంటికి వెళ్లేందుకని సంతోష్ కుటుంబం రైల్వేస్టేషన్కు వచ్చింది.
టికెట్టు తీసుకుని పుష్పుల్ ప్యాసింజర్లో భర్త, ఇద్దరు పిల్లలు, మిగతా బంధువులు రైలెక్కారు. అప్పటికే రైలు కదలగా చంకలో ఏడాదిన్నర వయసున్న సాత్వికను పెట్టుకుని రైలు ఎక్కేందుకు రజని ప్రయత్నించింది. ప్రమాదవశాత్తూ కాలుజారి కింద పడటంతో వెంటనే చంకలో ఉన్న బిడ్డను ప్లాట్ఫాంపైకి విసిరేసింది.
రైల్లో ఉన్న భర్త, బంధువులు కేకలు వేస్తుండగానే క్షణాల్లో రైలుచక్రాల కింద నలిగి రజని ప్రాణాలు విడిచింది. రైల్వే పోలీసులు వెంటనే పుష్పుల్ను నిలిపివేయించి, రజని మృతదేహాన్ని బయటకు తీశారు. ప్లాట్ఫాంపై పడటంతో సాత్విక రెండు కాళ్లకు స్వల్పంగా గాయాలయ్యాయి.
తండ్రి ఒడిలో కూర్చుని అమ్మ కావాలంటూ అంటూ ఆ పసిబిడ్డ రోదించడం అక్కడున్నవారిని కలచివేసింది. కళ్లముందే భార్యను కోల్పోయిన సంతోష్.. తన చిన్నారి పిల్లలు ఏడుస్తుండగా నిస్సహాయ స్థితిలో కూలబడిపోయాడు. ఈ ఘటన అక్కడున్నవారందరి హృదయాలను కదిలించింది.