మగ వ్యభిచారులు కావాలంటూ మోసం: మహిళ అరెస్ట్
హైదరాబాద్: మగ వ్యభిచారుల(మేల్ ఎస్కార్ట్స్) సేవల పేరుతో యువకులను మోసం చేస్తున్న పాతబస్తీకి చెందిన ఓ మహిళను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఫ్రెండ్స్ క్లబ్ పేరుతో ఆంగ్ల పత్రికలో ప్రకటన జారీ చేస్తూ.. మేల్ ఎస్కార్ట్(మగ వేశ్యలు)గా అవకాశం కల్పిస్తామంటూ వందమందికి పైగా యువకుల నుంచి డబ్బులు వసూలు చేసింది. సమాచారం అందడంతో సిసిఎస్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
సిసిఎస్ డిసిపి రవివర్మ కథనం ప్రకారం.. నూర్ఖాన్బజార్కు చెందిన ఫరీన్ నాజ్ 2010 నుంచి ఆంగ్ల దినపత్రికలో సిమ్రాన్ ఫ్రెండ్స్ క్లబ్ పేరిట ప్రకటన ఇస్తోంది. ఇందులో మధ్య తరగతి, హైక్లాస్ మహిళలతో ఫ్రెండ్షిప్ చేయిస్తామంటూ కాంటాక్ట్ అడ్రస్ ఇస్తోంది. దీనిని చూసిన పలువురు ఫోన్ చేయడంతో ముందుగా బ్యాంకులో రూ. 5 వేలు డిపాజిట్ చేయాలంటూ సూచిస్తోంది.
ఇంగ్లీష్లో మాట్లాడుతూ.. అవతలి వ్యక్తిని బుట్టలో వేసే నైపుణ్యం ఉండడంతో ఆమె అడిగినట్లు పలువురు బ్యాంకులలో డిపాజిట్ చేశారు. తిరిగి తమకు అవకాశం కల్పించలేదని ఫోన్ చేస్తే మరిన్ని డబ్బులు డిపాజిట్ చేయాలంటూ సూచించేది. ఇలా ఒక్కొక్కరి నుంచి రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు డిపాజిట్ చేయించింది. తర్వాత ఫోన్ నంబర్ను మార్చేది.
ఈ క్రమంలో ఓ వ్యక్తి రూ. 19 వేలు డిపాజిట్ చేసి మోసపోయిన విషయాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు అశ్యర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాలుగేళ్లుగా ఫ్రెండ్స్ క్లబ్ మాటున మోసం చేస్తున్నట్లు బయటపడింది. సుమారు రూ. 3.5 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
నకిలీ పాస్పోర్టులతో వచ్చిన 5గురి అరెస్టు
సౌదీ అరేబియా నుంచి నకిలీ పాస్పోర్టులపై వచ్చిన ఐదుగురు ప్రయాణికులను విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు రాజస్థాన్, ఇద్దరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారున్నారు. అక్కడ ఉద్యోగాలు కల్పించిన సంస్థలు తమ పాస్పోర్టులను లాగేసుకోవటంతో గత్యంతరం లేక నకిలీ పాస్పోర్టులపై వచ్చినట్లు వారు తెలిపారని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వర్గాలు పేర్కొన్నాయి.