రేప్ చేసి, మహిళను చంపేసి, అడవిలో మృతదేహాన్ని కాల్చేశారు
కరీంనగర్: కరీంనగర్-వరంగల్ జిల్లా సరిహద్దు మహాముత్తారం మండలం సింగారం-భూపాలపల్లి మండలం దూదేకులపల్లి-పందిపంపుల అడవుల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం బయటపడింది. సంఘటనా స్థలాన్నిబట్టి చూస్తే వారం క్రితమే కొందరు గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి, హతమార్చి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు తెలుస్తోందంటూ వార్తలు వచ్చాయి.
గుర్తు పట్టకుండా ఉన్నమృతదేహంపై పంజాబీ డ్రెస్సు, ఎడమకాలికి స్లిప్పర్ చెప్పు ఉండగా, రెండు చేతులను తొక్కిపట్టి అత్యాచారానికి ఒడిగట్టినట్లు సంఘటనా స్థలాన్నిబట్టి అర్థమవుతున్నది. మహిళను కొందరు దుండగులు ఇక్కడికి తీసుకువచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
అటవీ ప్రాంతంలో మృతదేహం ఉండడంతో అడవిలో ఉత్పత్తులు సేకరించే ఈ ప్రాంత గిరిజనులు భయపడుతున్నారు. అసలు ఏం జరిగిందని భయబ్రాంతులకు గురవుతున్నారు. వారం క్రితం గుర్తు తెలియని మహిళను కొందరు గుర్తు తెలియని దుండగులు సరిహద్దు అటవీ ప్రాంతంలోకి తీసుకొచ్చినట్లు అటవీ ఉత్పత్తులు సేకరించే గిరిజనులు చూసినట్లు తెలిపారని ఓ వార్తా సంస్థ కథనం.
అక్కడ సుమారు ఐదారుగురు కనబడినట్లు స్థానికులు చెబుతున్నా రు. అటవీ ప్రాంతంలో వాహనం ఆగడంతో తాము భయబ్రాంతులకు గురయ్యామని అంటున్నారు. హత్యకు గురైన మహిళ మాత్రం ఈ ప్రాంతానికి చెందినది కాదని స్పష్టమవుతోందంటూ ఆ మీడియా రాసింది.