ఆమె ఎటో వెళ్లింది: ఐదేళ్ల తర్వాత ఇంటికి తిరిగొచ్చింది
వరంగల్: ఐదేళ్ల క్రితం కనిపించకుండా పోయిన మహిళ వరంగల్ జిల్లాలోని మానుకోట రైల్వే స్టేషన్లో ప్రత్యక్షమైంది. వరంగల్ జిల్లీ కేసముద్రం మండలం కల్వల గ్రామంలో చిలుకూరి వెంకటమ్మ, సత్తెయ్య దంపతులు జీవనం సాగిస్తున్నారు.
వారికి కుమారుడు రాజు ఉన్నాడు. అయితే వెంకటమ్మకు భక్తి ఎక్కువ కావడంతో తరచూ దేవాలయాలకు వెళ్లి వస్తుండేది. ఎక్కడ జాతరలు, ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, భజనలు జరిగినా అక్కడికి వెళ్లేది. అలా ఐదేండ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిన వెంకటమ్మ తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆమె జాడ కోసం అన్ని ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు.
ఈ స్థితిలోనే గుర్తుతెలియని రైలు దిగిన వెంకటమ్మను కల్వల గ్రామాని కి చెందిన ముప్ప రవి, సమత దంపతులు గమనించారు. ఆమెను వెంకటమ్మగా గుర్తించిన వారు ఆమె కుమారుడు రాజుకు ఫోన్లో సమాచారం అందించగా హుటాహుటిన మానుకోట రైల్వే స్టేషన్కు చేరుకుని తమ తల్లిని గుర్తించి ఇంటికి తీసుకెళ్లాడు.
ఐదేళ్ల తర్వాత ఇంటికి వచ్చిన తల్లిని చూసి కన్నీళ్లపర్యంతమయ్యారు. వెంకటమ్మను చూసేందుకు గ్రామస్తులు తరలివచ్చారు. ఆమె ఈ ఐదేళ్లు ఎక్కడెక్కడ తిరిగింది, ఎలా జీవించింది తెలుసుకోవడానికి ఉత్సుకత ప్రదర్శించారు.