మహిళ దారుణ హత్య - ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి..!!
శంషాబాద్ ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని మహిళను దుండగులు దారుణంగా హత్యచేశారు. హత్యచేసిన తరువాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. పూర్తిగా కాలిపోయిన స్థితిలో మృతదేహం స్థానికులకు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నాలుగు ప్రత్యేక బృందాలు ఈ కేసు విషయమై రంగంలోకి దిగాయి
సైబరాబాద్ కమిషనరేట్ పరిధి శంషాబాద్ ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సాయి ఎన్క్లేవ్లోని మధురానగర్లో గురువారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలంకు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్వ్కాడ్ రంగంలోకిదిగి నిందితుల ఆధారాలకోసం వెతుకులాట ప్రారంభించారు. మరోవైపు పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా.. మహిళ మృతదేహంకు దుండగుడు నిప్పంటించి పారిపోతున్నట్లు కనిపించింది.

హత్యకు గురైన మహిళ వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే, మహిళను ఎందుకు చంపాల్సి వచ్చింది. పాత తగాదాలు ఏమైనా ఉన్నాయా.. మహిళను అత్యాచారం చేసి హత్య చేశారా అనే అనుమానాలుకూడా వ్యక్తమవుతున్నాయి. మహిళకోసం చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ లలో మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదయ్యాయా? అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. హత్యచేసింది ఆమెకు పరిచయం ఉన్న వ్యక్తులే అయి ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దర్యాప్తులో సీసీ టీవీ ఫుటేజ్ కీలకం కానుంది. శంషాబాద్ పోలీసులు అనుమానాస్పద మృతికింద కేసు నమోదు చేశారు. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి నిందితులకోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications