చనిపోయాడని వితంతువుగా మారింది: భర్త తిరిగొచ్చాడు
మహబాబ్నగర్: భర్త మరణించాడని ఓ మహిళ వితంతువుగా మారింది. అయితే అతను తిరిగి వచ్చాడు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లాలో జరిగింది. తప్పిపోయి మరణించాడని అనుకున్న ఆలూరుకు చెందిన గజ్జల వెంకటన్న బతికే ఉన్నాడనే విషయం వెలుగు చూసింది.
తాను క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన అతను హైదరాబాద్ నుంచి గద్వాలకు వచ్చాడు. తాను కూలీ పనుల నిమిత్తం పట్టణానికి వెళ్లానని, అక్కడ కొద్ది రోజులు పనులు చేసి తిరిగివచ్చానని చెప్పాడు. గత పది రోజుల నుంచి కుటుంబ సభ్యులు, స్థానికులు, పోలీసులను అతని అదృశ్యం అయోమయానికి గురిచేసింది. తిరిగి వచ్చిన వెంకన్నను ఎస్ఐ రాంబాబు కుటుంబ సభ్యులకు అప్పగించారు.

కాగా, వెంకటన్న తప్పిపోయిన మూడు రోజులకే గద్వాల నదీ అగ్రహారం సమీపంలోని కృష్ణానదిలో ఓ మృతదేహం లభ్యమైంది. అది వెంకటన్న మృతదేహమేనని తేల్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. వారు అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అయితే అంత్యక్రియలు ముగిసిన ఒకటి, రెండు రోజులకే ఉలిగేపల్లికి చెందిన కుర్వ గోవిందు కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడం, దుస్తులు, చెప్పులు, తాళం చెవ్వుల ఆధారంగా ఆలూరులో ఖననం చేసిన మృతదేహం గోవిందుదని నిర్ధారించారు.
దాంతో పూడ్చిన మృతదేహాన్ని వెలికితీసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కానీ వెంకటన్న ఏమయ్యారనేది తెలియలేదు. దాంతో తప్పిపోయిన వెంకటన్న ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ స్థితిలో ఆయనే స్వయంగా కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాడు.












Click it and Unblock the Notifications