యాదాద్రి గోపురానికి భారీగా బంగారం విరాళాలు - కడప జెడ్పీటీసీ సైతం : ఎవరెంత ఇచ్చారంటే..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం చేస్తున్న యాదాద్రి దేవాలయం నిర్మాణం అందరినీ ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగా యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడం కోసం తీసుకున్న నిర్ణయాన్ని తీసుకోవటంతో ..ఇందులో అందరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. దీని కోసం 125 కిలోల బంగారం అవసరమని అంచనా వేసారు. డబ్బు రూపంలో ఆ విలువ దాదాపు రూ 60 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. పార్టీ సమావేశంలో ఎంపీలు..ఎమ్మెల్యేలకు చెప్పానని వారు భాగస్వామ్యం తీసుకుంటామని ముందుకొచ్చారని సీఎం వివరించారు.

కేసీఆర్ కేజీ 16 తులాల బంగారం విరాళంగా ప్రకటన
తెలంగాణలోనీ ప్రతీ గ్రామాన్ని ఇందులో భాగస్వాములను చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడం కోసం తిరుమలలో చేసిన వారిని మన అధికారులు సంప్రదించారని సీఎం పేర్కొన్నారు. అతి త్వరగా కావాలంటే కొంత తక్కువ బంగారంలో తొందరగా అవుతుందని, లేదు తిరుమల మాదిరిగానే.. అదే ప్రమాణాలతో కావాలంటే కొంత ఎక్కువ సమయం, ఎక్కువ బంగారం పడుతుందని వారు చెప్పారని వివరించారు. మేము తిరుమల మాదిరిగా కావాలని.. అవసరమైతే అంత కన్నా మంచిగా కావాలని చెప్పామన్నారు.

పార్టీ నేతలు..పారిశ్రామిక వేత్తలు సైతం
దానికి వారు స్పందిస్తూ.. తమకు కొంత సమయం పడుతుందని చెప్పిన విషయాన్ని సీఎం వెల్లడించారు. తాను ఈ గోపురం స్వర్ణతాపడం తన వంతు బాధ్యతగా..తమ కుటుంబం నుంచి కిలో 16 తూలాల బంగారం విరాళంగా ప్రకటించారు. సీఎం కేసీఆర్ పిలుపుతో యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడం కోసం హెటిరో సంస్థ చైర్మన్ పార్థసారథిరెడ్డి తన కుటుంబం తరఫున 5 కిలోల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. సిద్ధిపేట నియోజకవర్గ ప్రజల తరఫున మంత్రి హరీశ్ రావు కిలో బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

నగదు - విరాళాలు ఇస్తామంటూ ముందుకు
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి టెంపుల్ సిటీలో కాటేజీ నిర్మిణానికి రూ.2 కోట్ల నగదు విరాళంగా ప్రకటించారు. స్వర్ణ తాపడం కోసం రెండు కిలోల బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. రంగరెడ్డి...మేడ్చల్ జిల్లాల ప్రజాప్రతినిధులు కిలో బంగారం చొప్పున విరాళం ప్రకటించారు. వ్యక్తిగతంగా కొందరు, నియోజకవర్గ ప్రజల పక్షాన మరికొందరు కిలో బంగారం చొప్పున ఇస్తామని స్పష్టం చేసారు. టీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కె.నవీన్ కుమార్, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు ఎ.గాంధీ, ఎం.హన్మంతరావు, ఎం.కృష్ణారావు, కేపీ వివేకానంద్ తమ కుటుంబాల తరఫున ఏడు కిలోల బంగారాన్ని ఆలయానికి అందించనున్నారు.

కడప జిల్లా జెడ్పీటీసీ సైతం కిలో బంగారం ఇస్తానంటూ
అయితే, తెలంగాణ నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా విరాళాలు ఇచ్చేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. ఇందులో భాగంగా వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన వ్యాపార వేత్త, చిన్నమండెం జెడ్పీటీసీ మోడెం జయమ్మ కిలో బంగారం విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ పిలుపు మేరకు తాను, తమ కుటుంబ సభ్యులందరం కలిసి కిలో బంగారాన్ని దేవాలయానికి విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన చెక్కును యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో అందిస్తామన్నారు. యాదాద్రి విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం జలవిహార్ ఎండీ రామరాజు కిలో బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో ఒక్క పూట సమయంలోనే ఇంత భారీ స్పందన రావటంతో..ఖచ్చితంగా త్వరలోనే మొత్తం కావాల్సిన బంగారం సమకూరుతుందని టీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications