ప్రాణం తీసిన సెల్ఫోన్: రైలు ఢీకొట్టి యువకుడి మృతి
హైదరాబాద్: హైటెక్ సిటీలో శనివారంనాడు విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్లో ట్రాక్ దాటుతున్న ఓ యువకుడిని రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో అతను ప్రాణాలు కోల్పోయాడు. రైల్వే స్టేషన్లో ప్రయాణికులు, సిబ్బంది వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించరాు. మృతుడు సెల్ఫోన్లో మాట్లాడుతూ రైల్వే ట్రాక్ దాటుతూ రైలు రాకను గమనించలేదని, దానివల్లనే అతను ప్రమాదంలో మరణించాడని అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ఇదిలావుంటే, నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం తుజాల్పూర్లో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తిని వెంకట్గా గుర్తించారు. వెంకట్ను హత్య చేసిన దుండగులు అతని ట్రాక్టర్ను తగులబెట్టారు.
వరంగల్ జిల్లా హసన్పర్తిలో పెద్ద యెత్తున పోలీసులు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ నుంచి తరలిస్తున్న 3,200 డిటోనేటర్లను, 3,200 జిలిటెన్ స్టిక్స్ను పోలీసులు పట్టుకున్నారు.
నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు శనివారం ఉదయం ప్రమాదానికి గురైంది. మెదక్ జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద ఓవర్ లోడ్తో వెళ్తున్న లారీ బస్సును ఢీకొనడంతో శనివారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 20 మంది గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సును హెల్పేజ్ ఇండియాదిగా గుర్తించారు.