చెన్నైలో జగన్ విశ్రాంతి: తెలంగాణ ఎమ్మెల్యేలు ఎందుకు?
హైదరాబాద్: తెలంగాణలో పార్టీని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి గాలికి వదిలేసినట్లు అర్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంలో చేరిన తమ శాసనసభ్యులపై అనర్హత వేటు వేయించేందుకు ప్రభుత్వంపైనా, స్పీకర్పైనా వైయస్ జగన్ అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు.
తుది ప్రయత్నంగా ద్రవ్య వినిమయ బిల్లుపై ఓటింగ్కు కూడా పట్టుబట్టారు. కానీ తెలంగాణలో తమ పార్టీ తరపున గెలిచి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు.
తెలంగాణ అంశాలకు జగన్ పూర్తిగా దూరంగా ఉంటున్నారు. పైగా తెరాసకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయన సహకరిస్తున్నట్లు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అసలు పోటీయే చేయకుండా పాలక పక్షానికి పరోక్షంగా సహకరించారనే వాదన కూడా ఉంది.
తెలంగాణలోని ఎమ్మెల్యేల జంపింగ్ల గురించి మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు "తెలంగాణ సంగతెందుకు? అక్కడి ఎమ్మెల్యేల సంగతెందుకు? నేను సీమాంధ్ర ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నా" అని జగన్ గురువారంనాటి మీడియా సమావేశంలో అసహనం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 4వ తేదీన వైసీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరుగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ భేటీలో పలు అంశాలను చర్చిస్తామని ప్రకటించారు. ఈ భేటీకి జగన్ హాజరయ్యే అవకాశం కూడా లేదని అంటున్నారు.
ఇదిలావుంటే, వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి శుక్రవారం చెన్నై చేరుకున్నారు. ఆయన అక్కడే రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు సమాచారం. జగన పెదనాన్న వైఎస్ జార్జ్రెడ్డి కుమారులు వైఎస్ సునీల్రెడ్డి, వైఎస్ అనిల్రెడ్డి చెన్నైలోనే ఉంటున్నారు.