మంత్రి పువ్వాడ,డీజీపీ మహేందర్ రెడ్డిలకు వైఎస్ షర్మిల అనుచరుడి వార్నింగ్...
తెలంగాణలో వైఎస్ షర్మిల ముఖ్య అనుచరుడు కొండా రాఘవ రెడ్డి.. మంత్రి పువ్వాడ అజయ్,డీజీపీ మహేందర్ రెడ్డిలకు వార్నింగ్ ఇచ్చారు. మంత్రి పువ్వాడ అజయ్ చిల్లర మల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. డీజీపీ మహేందర్ రెడ్డి టీఆర్ఎస్ కండువా అయినా కప్పుకోవాలి లేదా ఐపీఎస్ ఆఫీసర్గా అయినా వ్యవహరించాలని ఫైర్ అయ్యారు.
ఖమ్మం సంకల్ప సభను ఆరు వేల మందితో నిర్వహించుకునేందుకు కమిషనర్ అనుమతించారని... అలాంటప్పుడు సభకు వచ్చేవారిని ఎందుకు అడ్డుకుంటున్నారని డీజీపీని రాఘవ రెడ్డి ప్రశ్నించారు. డీజీపిగా మీరు మంచి పేరు ఉందని... గతంలో పలువురు ముఖ్యమంత్రుల కింద పనిచేసిన మీరు.. ఆ పేరును చెడగొట్టుకోవద్దని అన్నారు. ఖమ్మం మైదానం బయట సూర్యాపేట నుంచి వచ్చిన వందలాది మందిని లోపలికి రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఖమ్మంలో వైఎస్ షర్మిల సభ చూసి పోలీసులకు భయమవుతుందా... ముఖ్యమంత్రికి భయమవుతుందా.. లేక ఇక్కడి మంత్రికి భయమవుతుందా అని ప్రశ్నించారు.
'మీ పునాదులు కదులుతున్నాయి... త్వరలో జరగబోయే ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని నిలదీస్తారు... అభిమానులను మీరు ఆపలేరు... దయచేసి సభకు వచ్చేవారిని మైదానం లోపలికి అనుమతించాలని మనవి చేస్తున్నాను..' అని కొండా రాఘవ రెడ్డి వ్యాఖ్యానించారు.
Recommended Video
తెలంగాణలో రాజన్న రాజ్యమే ధ్యేయంగా వైఎస్ షర్మిల ఖమ్మంలో సంకల్ప సభతో రాష్ట్రంలో తన రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభిస్తున్న సంగతి తెలిసిందే. లక్ష పైచిలుకు మందితో ఈ సభను ఘనంగా నిర్వహించాలని భావించినప్పటికీ కరోనా నేపథ్యంలో ఆరు వేల మందితోనే సభను నిర్వహించేందుకు పోలీసులు అనుమతినిచ్చారు. సంకల్ప సభ వేదికగా వైఎస్ షర్మిల... తమ పార్టీ పేరు,ఎజెండాను ప్రకటించే అవకాశం ఉంది. ఈ సభకు వైఎస్ షర్మిలతో పాటు వైఎస్ విజయమ్మ కూడా హాజరయ్యారు. సభలో షర్మిల ఏం మాట్లాడబోతున్నారన్న దానిపై ఆసక్తి నెలకొంది.